తెలంగాణ మాజీ సిఎం కేసీఆర్ మళ్ళీ ఈరోజు ఉదయం హైదరాబాద్, సోమాజీగూడ యశోద హాస్పిటల్లో చేరారు. వైద్యులు ఆయనకు వైద్య పరీక్షలు చేస్తున్నారు.
జూలై 3న కేసీఆర్ యశోద హాస్పిటల్లో చేరగా వైద్యులు ఆయనకు అన్ని పరీక్షలు చేసి బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నాయని గుర్తించారు. సోడియం తక్కువగా ఉనందున చాలా నీరసంగా ఉన్నారని గుర్తించి తగిన చికిత్స చేసి జూలై 5న డిశ్చార్జ్ చేశారు. అప్పుడు హాస్పిటల్లో ఉన్నప్పుడే పార్టీ ముఖ్యనేతలతో సమావేశమయ్యారు.
బనకచర్ల ప్రాజెక్టు, కాళేశ్వరం ప్రాజెక్టు తదితర అంశాల గురించి వారితో చర్చించారని, రెండు మూడు రోజులలో ప్రెస్మీట్ పెట్టి మాట్లాడుతారని బీఆర్ఎస్ పార్టీ నేతలు చెప్పారు. కేసీఆర్ ఆరోగ్యం బాగానే ఉందని కేటీఆర్ ట్వీట్ చేశారు.
కానీ ఈరోజు కేసీఆర్ మళ్ళీ హాస్పిటల్లో చేరడంతో ఆయనకు ఏదో ఆరోగ్య సమస్య ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బహుశః అందుకే కేసీఆర్ ఇదివరకు హాస్పిటల్లో చెరినప్పుడు పార్టీ ముఖ్య నేతలతో అత్యవసర సమావేశం నిర్వహించి, పార్టీ పగ్గాలను కేటీఆర్కు అప్పగించే విషయమై చర్చించి ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
కానీ కేటీఆర్ నాయకత్వాన్ని అంగీకరించబోనని కూతురు కల్వకుంట్ల కవిత చెపుతున్నాడున ఆమె విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకోవాలో కేసీఆర్ ఆలోచించాల్సి ఉంటుంది.
ముందుగా ఆమెతో ఏర్పడిన సమస్యని పరిష్కరించకుండా పార్టీ పగ్గాలని కేటీఆర్ చేతిలో పెడితే, అప్పుడు ఆమె కేటీఆర్, హరీష్ రావు, బీఆర్ఎస్ పార్టీ గురించి నోరువిప్పి మాట్లాడితే ఇంకా ఇబ్బందికరంగా మారుతుంది.
కానీ కేసీఆర్ పార్టీకి, రాజకీయాలకు దూరంగా ఫామ్హౌస్లో ఉంటూ పార్టీని అప్పగిస్తేనే కేటీఆర్, హరీష్ రావు పార్టీని నడిపించలేక బీజేపీలో విలీనం చేసేసేందుకు సిద్దపడ్డారని కవిత బయటపెట్టారు.
ఒకవేళ కేసీఆర్ ఆరోగ్య కారణాలతో రాజకీయాల నుంచి తప్పుకొని బీఆర్ఎస్ పార్టీని కేటీఆర్ లేదా హరీష్ రావు చేతికి అప్పగించేస్తే నడిపించగలరా?లేదా కవిత చెప్పినట్లు బీజేపీలో విలీనం చేసేస్తారా? ఏది ఏమైనప్పటికీ, బీఆర్ఎస్ పార్టీ పగ్గాలు పార్టీలో ఎవరో ఒకరికి అప్పగించాల్సిన సమయం వచ్చినట్లే అనిపిస్తోంది.




