మాజీ ముఖ్యమంత్రులు జగన్, కేసీఆర్లని పోల్చి చూసినప్పుడు కొన్నిటిలో ఒకేలా మరికొన్నిటిలో పూర్తి భిన్నంగా వ్యవహరించేవారు.
ఉదాహరణకి తెలంగాణ ఏర్పడి కేసీఆర్ తొలిసారి ముఖ్యమంత్రి కాగానే ప్రాధాన్యం కోల్పోయిన తెలంగాణ భాష, యాస, సంస్కృతీ సంప్రదాయాలు, పండుగలు, పబ్బా, కళలు, సాహిత్యానికి పూర్వవైభవం తీసుకువచ్చేందుకు బలమైన చర్యలు చేపట్టారు. అప్పటి నుంచే మళ్ళీ వాటన్నిటికీ మళ్ళీ గుర్తింపు, గౌరవం, ఆదరణ లభించడం మొదలైంది.
ఒకప్పుడు సినిమాలలో తెలంగాణ భాషని హాస్యం కోసం లేదా విలన్ల కోసం వాడేవారు. కానీ ఇప్పుడు తెలంగాణ భాష, యాస, సంస్కృతీ సంప్రదాయాలు ఉట్టిపడేలా ‘బలగం’ వంటి చక్కటి సినిమాలు వస్తున్నాయి. అంటే పాలకులకి తపన, చిత్తశుద్ది ఉంటే వాటిని కాపాడుకోవచ్చని కేసీఆర్ నిరూపించి చూపారు.
అయితే జగన్మోహన్ రెడ్డి తెలుగు భాష, సంస్కృతీ, సంప్రదాయాలని దెబ్బతీసేందుకు చేశారని చెప్పక తప్పదు. ప్రభుత్వ పాఠశాలలో తెలుగుని పక్కన పెట్టి ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టారు. మతమార్పిడులని ప్రోత్సహించారు.
ఆలయాలలో దొంగతనాలు, దేవతామూర్తుల విగ్రహాల ధ్వంసం, తెలుగువారి ఆరాధ్య దైవం తిరుమల శ్రీవారి కొండపై అన్యమత ప్రచారాలు, మద్యం, మాంసాహారం, మాదక ద్రవ్యాలు సరఫరా, టీటీడీలో వైసీపి రాజకీయాలు, , తిరుమలలో వైసీపి నాయకుల హడావుడి వంటివన్నీ భక్తుల మనోభావాలను దెబ్బతీశాయి.
చివరికి వినాయక చవితి పండుగకు విగ్రహాలు అమ్మకాలు, నిమజనంపై కూడా ఆంక్షలు విధిస్తూ ప్రజల మనోభావాలను దెబ్బ తీశారు. తెలుగు సినీ పరిశ్రమని ఇబ్బందిపెట్టడం వంటివన్నీ జగన్ పద్దులోనే ఉన్నాయి.
ఈవిషయంలో కేసీఆర్, జగన్ పూర్తి భిన్నంగా వ్యవహరించినా ఇద్దరూ ఓడిపోయారు కదా?అనే సందేహం కలుగక మానదు. వారి ఓటమికి ఇతర కారణాలు చాలానే ఉన్నాయి.
అయితే భాషా సంస్కృతుల విషయంలో వారి ఆలోచనలను మరింత నిశితంగా పరిశీలిస్తే అవి కూడా భిన్నంగానే ఉన్నాయనే విషయం అర్దమవుతుంది.
కేసీఆర్, బిఆర్ఎస్ పార్టీ ‘తెలంగాణ సెంటిమెంట్’ మీద ఎక్కువగా ఆధారపడుతుందని అందరికీ తెలిసిందే. ఆ సెంటిమెంట్ బలంగా ఉండాలంటే తెలంగాణ భాష, సంస్కృతీ సంప్రదాయాలు కూడా బలంగా ఉండటం చాలా అవసరమని కేసీఆర్ భావించి ఉండవచ్చు. వాటిని కూడా బలోపేతం చేసుకొని పూర్వవైభవం కల్పిస్తే, బిఆర్ఎస్ పార్టీకి ఇక తిరుగు ఉండదని భావించి ఉండవచ్చు.
కేసీఆర్ ఏ ఉద్దేశ్యంతో చేసినప్పటికీ వాటికి పూర్వవైభవం కలిగినందున కేసీఆర్ని మనస్ఫూర్తిగా అభినందించాల్సిందే.
జగన్ అందుకు భిన్నంగా తనదైన శైలిలో ఆలోచించి, తెలుగు భాషా సంస్కృతులను నశింపజేయగలిగితే వైసీపికి తిరుగు ఉండదని భావించి ఉండవచ్చు.
బహుశః అందుకే జగన్ ఓ పద్దతి ప్రకారం తెలుగు భాష, సంస్కృతీ సాంప్రదాయాలని, పండుగలు, వాటన్నిటితో ముడిపడిన చిత్రపరిశ్రమని కూడా దెబ్బతీసి తుడిచిపెట్టేయాలని ప్రయత్నించారని చెప్పక తప్పదు.
తెలుగులో సరిగ్గా మాట్లాడటం కూడా చేతకాని జగన్కి తెలుగు భాష పట్ల మమకారం ఉంటుందనుకోలేము. కానీ ఇటువంటి దురాలోచనలు కూడా కలిగి ఉండటం శోచనీయం.
అయితే తెలుగు భాష, సంస్కృతీ సంప్రదాయాల పట్ల అభిమానం కలిగిన చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇప్పుడు పాలకులు కావడంతో మళ్ళీ వాటికి తప్పక పూర్వ వైభవం లభిస్తుందని ఆశించవచ్చు.
గిడుగు రామమూర్తి జయంతి పురస్కరించుకొని నిన్న విజయవాడలో జరిగిన కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, “జీతం కోసం ఇంగ్లీష్, జీవితం కోసం తెలుగు’ అని చాలా క్లుప్తంగా అద్భుతంగా చెప్పారు. ఈ సందర్భంగా ఆయన చాలా చక్కటి విషయాలు చాలా చెప్పారు. కనుక వాటి గురించి వేరేగా చెప్పుకుందాము.




