సాధారణంగా రాజకీయ పార్టీల మద్య, వాటి అధినేతల తీరులో కొన్ని పోలికలు కనిపించడం సహజం. కానీ జిరాక్స్ కాపీలా అన్నీ ఒకేలా ఉండటం చాలా అరుదు. ఆంధ్రాలో వైసీపీ దాని అధినేత జగన్, తెలంగాణలో బిఆర్ఎస్ దాని అధినేత కేసీఆర్ మద్య ఇటువంటి అరుదైన ‘జిరాక్స్ ఆలోచనలు, జిరాక్స్ వైఖరి’ కనిపిస్తుంటాయి.
ఇద్దరూ అహంభావం వల్లనే ఎన్నికలలో వారి పార్టీలను ఓడగొట్టుకొని మాజీ ముఖ్యమంత్రులయ్యారు. ఇద్దరూ ఇంట్లో నుంచి బయటకు రావడానికి ఇష్టపడటం లేదు. ఇద్దరూ శాసనసభ సమావేశాలకు మొహం చాటేస్తున్నారు. తమ ఎమ్మెల్యే పదవి కూడా ఊడిపోతుందేమోననే భయంతోనే అటెండన్స్ వేసుకునేందుకు మాత్రమే శాసనసభకు వచ్చి పోతుంటారు.
ఇద్దరికీ వేలకోట్ల ఆస్థులున్నాయి. కానీ ఇద్దరూ శాసనసభ సమావేశాలకు రాకపోయినా నెలనెలా ప్రభుత్వం అందించే సుమారు రూ.2-2.50 లక్షల జీతాభత్యాలు వద్దనకుండా తీసుకుంటూనే ఉన్నారు.
ఇద్దరూ జనం మద్యకు, పార్టీ కార్యకర్తల వద్దకు వెళ్ళకుండా వారినే తమ ప్యాలస్లకు పిలిపించుకొని దర్శన భాగ్యం కల్పించి పంపిస్తుంటారు.
జగన్, కేసీఆర్ ఇద్దరూ తమకంటే గొప్పగా మరెవరూ రాష్ట్రాన్ని పాలించలేరనే నిశ్చితాభిప్రాయం, తాము తప్ప మరెవరూ రాష్ట్రాన్ని, ప్రజలను కాపాడలేరనే గట్టిగా వాదిస్తుంటారు. కనుక జగన్, కేసీఆర్ ఇద్దరూ కూడా తమ రాకకోసం ప్రజలందరూ వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారని చెపుతుంటారు.
అయితే రెండు విషయాలలో జగన్ కంటే కేసీఆర్ కొంత నయం అనిపిస్తారు. ఆయన శాసనసభ సమావేశాలకు వెళ్ళకపోయినా తన పార్టీ ఎమ్మెల్యేలని పంపిస్తున్నారు. కానీ జగన్ నేను వెళ్ళకపోతే మరెవరూ శాసనసభకు వెళ్ళాల్సిన అవసరమే లేదన్నట్లు వ్యవహరిస్తుంటారు.
సంక్రాంతికి వస్తున్నాం అని జగన్, కేసీఆర్ ప్రామిస్ చేశారు. విక్టరీ వెంకటేష్ వచ్చి వెళ్ళారు కానీ వీళ్ళిద్దరూ ఇంకా బయటకు రానేలేదు. కానీ ఏప్రిల్ 27న బిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వరంగల్లో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ఆ సభలో కేసీఆర్ పాల్గొని ప్రసంగించనున్నారు. శాసనసభకు వచ్చేందుకు ఇష్టపడని జగన్, కేసీఆర్ ఈవిదంగా బయట సభలు, సమావేశాలకు హాజరవుతుండటం మరో జిరాక్స్ పోలికే కదా?




