కేసీఆర్‌ మౌనం: రేవంత్‌ స్థాయి సరిపోదా?

revanth-reddy-kcr

కేసీఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎప్పుడో చనిపోయిన ఇందిరాగాంధీ మొదలు ప్రధాని మోడీ, చంద్రబాబు నాయుడు, రేవంత్‌ రెడ్డి వరకు ఆయన నోటికి బలవ్వని రాజకీయ ప్రముఖుడు లేరంటే అతిశయోక్తి కాదు. అప్పుడు అధికారంలో ఉన్నారు కనుక ఆయన ఏది మాట్లాడితే అదే ఒప్పుగా సాగేది.

ADVERTISEMENT

లోక్‌సభ ఎన్నికల సమయంలో మళ్ళీ ‘ఉద్యమాల నాటి కేసీఆర్‌ని అందరూ చూస్తారని’ కేసీఆర్‌ గొప్పగా చెప్పుకున్నారు. కానీ ఆ ఎన్నికలలో ఒక్క సీటు కూడా గెలుచుకోలేక ఓడిపోవడంతో ఆయన ఇదివరకులా బయటకు రావడం లేదు.

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం, పార్టీపై తాను చేయాలనుకున్న విమర్శలు, ఆరోపణలను, అలాగే ప్రజలకు తాను చెప్పదలచుకున్న విషయాలను అన్నిటినీ కేటీఆర్‌, హరీష్ రావుల ద్వారానే చెప్పించేస్తున్నారు. అలాగే వారిచేతే పార్టీ వ్యూహాలు కూడా అమలు చేయిస్తున్నారు.

పది మంది ఎమ్మెల్యేలు, ఆరుగురు ఎమ్మెల్సీలు కాంగ్రెస్‌లో చేరిపోతే, కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌ నుంచి బయటకు రాకుండా కేటీఆర్‌, హరీష్ రావుల చేతే మాట్లాడిస్తున్నారు. వారిపై అనర్హత వేటు వేయాలని కేటీఆర్‌ చేత స్పీకర్‌ని అడిగించారు.

పంట రుణాల మాఫీ అంశంపై కేటీఆర్‌, హరీష్ రావులు మాత్రమే కాంగ్రెస్‌ ప్రభుత్వంతో యుద్ధం చేస్తుండటం మరో తాజా ఉదాహరణగా భావించవచ్చు.

అంటే ఇంకా కేసీఆర్‌ బయటకు రారా?ఇదివరకులా చురుకుగా రాజకీయాలలో పాల్గొనరా?పదవి, అధికారం ఉంటే తప్ప సింహంలా గర్జించలేరా?ఆనాటి ఉద్యమ కేసీఆర్‌ ఏమైపోయాడు? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

ఈ ప్రశ్నలన్నిటికీ మరో బలమైన కారణం కనిపిస్తోంది. ఇదివరకు కేసీఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బీజేపీతో పోరాడాల్సివస్తే ప్రధాని నరేంద్రమోడీపై కత్తులు దూసేవారు. బండి సంజయ్‌, కిషన్ రెడ్డి తదితరులు అందరూ చిల్లర నాయకులు అనేవారు.

అంటే కేసీఆర్‌ తనది ‘ప్రధాని స్థాయి’ అని భావించడం వలననే స్థానిక బీజేపీ నేతలకు తన మంత్రులు ఎమ్మెల్యేల చేత జవాబు చెప్పించేవారని అనుకోవచ్చు.

కానీ ఎప్పుడైనా ప్రధాని నరేంద్రమోడీ హైదరాబాద్‌కు వస్తే ఆయనకు స్వాగతం చెప్పడానికి కేసీఆర్‌ వెళ్ళకుండా మంత్రి తలసానిని పంపిస్తుండేవారు. అంటే ప్రధాన మంత్రి ‘తన స్థాయికి తగినవారు కారని, ఆయనది తన మంత్రి స్థాయి మాత్రమే’ అని చెప్పకనే చెప్పేవారు.

అటువంటి కేసీఆర్‌ ఇప్పుడు ఎందుకు బయటకు రావడం లేదు? ఎందుకు గర్జించడం లేదు? అంటే తాను గొప్ప రాజకీయ మేధావినని, తన మాటకు, అంచనాలకు, వ్యూహాలకు తిరుగులేదనే గట్టి నమ్మకంతో ఉండేవారు. ఆ నమ్మకాన్ని రేవంత్‌ రెడ్డి దారుణంగా దెబ్బ తీశారు.

దాంతో ఆయన అహం దెబ్బ తిని ఉండవచ్చు లేదా రేవంత్‌ రెడ్డి తన కంటే తెలివైనవాడని గ్రహించి ఉండవచ్చు లేదా ‘రేవంత్‌ రెడ్డిది తన స్థాయి కాదని’ కేసీఆర్‌ భావిస్తున్నారేమో?

కేసీఆర్‌ ఏ కారణంతో మౌనం వహిస్తున్నప్పటికీ దాని వలన రేవంత్‌ రెడ్డి ప్రభుత్వానికి చాలా ఊరట లభిస్తోంది. కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌కే పరిమితం అవుతుండటంతో బిఆర్ఎస్ పార్టీకి నాయకత్వ సమస్య కూడా ఏర్పడుతోంది. కేసీఆర్‌ లేని బిఆర్ఎస్ పార్టీని రేవంత్‌ రెడ్డి, మంత్రులు అవలీలగా ఎదుర్కోగలుగుతున్నారు.

ADVERTISEMENT
Latest Stories