కేసీఆర్‌ చేతికి మళ్ళీ సెంటిమెంట్ ఆయుధాలు… అవసరమా?

KCR

తెలంగాణ సిఎం రేవంత్‌ రెడ్డి తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు ఎన్నికలలో ఓడిపోయి బలహీనపడిన బిఆర్ఎస్ పార్టీ మళ్ళీ పుంజుకునేందుకు అవసరమైన అస్త్రశస్త్రాలను అందజేస్తున్నట్లు అవుతోంది.

తెలంగాణ రాజముద్రలో కాకతీయ తోరణం, ఛార్మినార్ తొలగించాలనే నిర్ణయం, ‘జయ జయహే తెలంగాణ గీతాన్ని ఆంధ్రాకు చెందిన సంగీత దర్శకుడు కీరవాణితో స్వరపరచాలనే రెండు నిర్ణయాలు, ఢీలా పడిన కేసీఆర్‌ చేతికి రెండు దివ్యాస్త్రాలుగా అందించారు.

ADVERTISEMENT

బిఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి తెలంగాణ సెంటిమెంట్‌ ఆధారంగానే రాజకీయాలు చేస్తోంది. కనుక రేవంత్‌ రెడ్డి అందించిన ఈ అవకాశాన్ని కేసీఆర్‌ వెంటనే అందుకుని చకచకా పావులు కదుపుతున్నారు.

రాజముద్రలో ఈ మార్పులను నిరసిస్తూ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తదితరులు నేడు ఛార్మినార్ వద్ద ఆందోళనకు సిద్దమయ్యారు. రాజముద్రలో ఛార్మినార్ బొమ్మ తొలగించడానికి వీల్లేదంటూ ఛార్మినార్ వద్దనే బిఆర్ఎస్ నేతలు ఆందోళన చేయడం ద్వారా ఆ ప్రాంతంలో ముస్లింలు వారికి సంఘీభావం తెలుపుతారు. మళ్ళీ బిఆర్ఎస్ పార్టీకి దగ్గరవుతారని వేరే చెప్పక్కరలేదు

తెలంగాణ రాజముద్ర మార్పు విషయంలో ఈవిదంగా ప్రత్యక్ష పోరాటాలు చేస్తున్న బిఆర్ఎస్ నేతలు, తెలంగాణ గీతాన్ని కీరవాణి చేత స్వరపరిచే విషయంలో నేరుగా పోరాడకుండా తమ సానుభూతిపరుల ద్వారా సోషల్ మీడియాలో యుద్ధం మొదలుపెట్టించారు. తద్వారా తమ చేతికి మట్టి అంటకుండా రాష్ట్రంలో మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ రగిలించి దాంతో బిఆర్ఎస్ పార్టీ రాజకీయ మైలేజీ పొందాలని ఆశిస్తున్నట్లు అర్దమవుతోంది.

తెలంగాణ ప్రజలు, రాజకీయ వర్గాల దృష్టిలో కేసీఆర్‌ని ఓడగొట్టిన మొగాడుగా నిలిచిన రేవంత్‌ రెడ్డి, అధికరంలోకి వచ్చిన 5-6 నెలల్లోనే కేసీఆర్‌కు ఈవిదంగా దొరికిపోతుండటం ఆశ్చర్యం కలిగిస్తుంది. పాలనపై దృష్టి పెట్టాల్సిన రేవంత్‌ రెడ్డి, జగన్మోహన్‌ రెడ్డిలా కేసీఆర్‌పై కక్ష సాధించేందుకు ఇటువంటి అనవసరమైన పనులతో ప్రజలలో దురభిప్రాయం కలిగేలా చేసుకుంటున్నారని చెప్పక తప్పదు.

ADVERTISEMENT
Latest Stories