నువ్వా నేనా అన్నట్టుగా ఆంధ్ర రాజకీయాలు హైద్రాబాద్ ధమ్ బిర్యానీని తలపిస్తుంటే తెలంగాణ రాజకీయాలు మాత్రం గోదావరి జిల్లాలోని పూతరేకులు మాదిరి సాఫ్ట్ గా వెళుతున్నాయి. కేసీఆర్ అధికారంలో ఉన్న పదేళ్లు ఒక నియంత మాదిరి ప్రతిపక్ష నాయకుల గొంతు నొక్కి, విపక్ష పార్టీలను భూస్థాపితం చేస్తే అధికారం చేజారగానే కొండ మీద నుండి జారిన జలపాతం మాదిరి నేలకొరిగింది బిఆర్ఎస్.
అసెంబ్లీ ఎన్నికలలో తెరాస గా మారిన బిఆర్ఎస్ పేరులోనే కాదు హోదాలో కూడా మార్పు సాధించింది. తెరాస గా ఉన్నప్పుడు అధికార పక్షంగా ఉన్న బిఆర్ఎస్ పార్టీ పేరు మారగానే ప్రతిపక్ష పార్టీగా రూపాంతరం చెందింది. అయితే దీనికి పార్టీ పేరు మార్పుతో పాటుగా అధికారం ఉందనే అహంకారం బిఆర్ఎస్ నాయకులలో పెరిగిపోవడం, ప్రతిపక్ష పార్టీలను చాల తక్కువగా అంచనా వేయడం, ఉన్న రాష్ట్రంతో పాటుగా పక్క రాష్ట్ర రాజకీయాలలో కూడా తామే చక్రం తిప్పేయాలనే కేసీఆర్ అత్యాశ బిఆర్ఎస్ పార్టీ ఓటమికి ప్రధాన కారణాలు.
ఇప్పటికే కేసీఆర్ కూతురు కవిత ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్టయ్యి తీహార్ జైల్లో బెయిలు కోసం రోజులు లెక్కపెడుతున్నారు. అటు అసెంబ్లీతో పాటుగా ఇటు పార్లమెంట్ ఎన్నికలు కూడా ముగియడంతో ఇక బిఆర్ఎస్ పార్టీ మీద, ఆ పార్టీ నాయకుల మీద పూర్తి ఫోకస్ పెట్టనుంది కాంగ్రెస్ పార్టీ. తనను జైలుకు పంపిన కేసీఆర్ కుటుంబానికి జైల్లో డబుల్ బెడ్ రూమ్ కట్టిస్తా అంటూ ముఖ్యమంత్రి రేవంత్ తానూ చేసిన సవాల్ ను నిలబెట్టుకోవడానికి ఉన్న అన్ని అస్త్రాలను బయటకు తీస్తారు.
ఇప్పటికే ఫోన్ టాపింగ్ కేసును తవ్వి తీసిన రేవంత్ అందులో కేటీఆర్ పాత్ర పైనే ఎక్కువ ఫోకస్ పెట్టారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కుంటున్న అధికారులు ఒక్కొక్కరుగా ప్రభుత్వానికి సహకరించడంతో కేటీఆర్ పై కూడా త్వరలోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఉచ్చు బిగించే అవకాశం లేకపోలేదు. ఓటమి భాదను, భారాన్ని ఎదుర్కొంటు కూడా ఏపీ రాజకీయాలలో వేలు పెట్టారు కేసీఆర్.
ఏపీలో తిరిగి వైసీపీ పార్టీనే అధికారంలోకి వస్తుందని, జగన్ మరోసారి సీఎం గా బాధ్యతలు చేపడతారని జోస్యం చెప్పిన కేసీఆర్ కు ఏపీ ఎగ్జిట్ పోల్స్ గట్టి షాకే ఇచ్చాయి. టీడీపీ కూటమి భారీ మెజారిటీతో ప్రభుత్వాన్ని స్థాపించబోతుంది అంటూ నేషనల్ సర్వే సంస్థలన్నీ తేల్చి చెప్పడంతో కేసీఆర్ పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్టయ్యింది. ఇదిలా ఉంటే అసలు తెలంగాణ పార్లమెంట్ పోటీలో బిఆర్ఎస్ కారు ఖాతా తీరుస్తుందా.? లేదా.? అన్న అనుమానాలు ఆ పార్టీ నేతలే వ్యక్త పరుస్తున్నారు.
పార్టీలోని సీనియర్ నాయకులతో పాటు మరికొంతమంది బిఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ కండువా కప్పుకుని కేసీఆర్ కు ఓటమి తాలూకా పర్యవసానాలను చవి చూపించారు. ఇప్పటికే తెలంగాణలో బిఆర్ఎస్ కారు స్థానాన్ని భర్తీ చేయడానికి బీజేపీ కమలం సిద్దమయ్యింది. ఇటువంటి సందర్భంలో బిఆర్ఎస్ పార్టీలో నిశబ్ద యుద్ధం కొనసాగుతూ వస్తుంది. “అధికారం చేతిలో ఉన్నన్నాళ్ళు నియంతృత్వాన్ని నమ్ముకున్న కేసీఆర్ ఇప్పుడు నిస్సహాయతలో” ఒంటరిగా మిగిలిపోయారు.
అధికారం అనేది ఏ ఒక్కరికి శాశ్వత కాదు అనేది ఇప్పటికైనా రాజకీయ నాయకులు గ్రహిస్తే భవిష్యత్తు రాజకీయ నాయకులు ఇటువంటి పరిస్థితులను ఎదుర్కోకపోవచ్చు. అధికారం ఉంది కదా అనే అహకారం తలకెక్కితే పైన ఆకాశం తో పాటుగా కింద పాతాళం కూడా ఉందనేది ఆ భగవంతుడితో పాటుగా ఓటర్లు కూడా తెలియచెప్తారు.




