మోడీ ప్రభుత్వాన్ని గద్దె దింపాలని తెలంగాణ సిఎం కేసీఆర్ ప్రయత్నిస్తుంటే, రాష్ట్రంలో ఆయనను గద్దె దించాలని బిజెపి ప్రయత్నిస్తుండటం విశేషం. ఇందుకు టిఆర్ఎస్, బిజెపిలు రెండూ చెపుతున్న కారణం ఒకటే కావడం మరో విశేషం.
అవినీతిలో కూరుకుపోయి నిరంకుశ, అప్రజాస్వామిక పాలన సాగిస్తూ దేశాన్ని, రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించేస్తున్నాయని పరస్పరం ఆరోపించుకొంటున్నాయి. కనుక ఒకరినొకరు గద్దె దింపుకోవడం తప్పనిసరి అని రెండు పార్టీలు వాదిస్తున్నాయి.
అయితే వాస్తవ కారణం ఏమిటి?అని ఆలోచిస్తే ప్రజాస్వామ్యాన్ని త్యజించడమే అని చెప్పక తప్పదు.
సిఎం కేసీఆర్ తెలంగాణను తన సొంత రాజ్యంగా భావిస్తున్నారు. కనుక తన రాజ్యాన్ని ఆక్రమించడానికి వచ్చిన బిజెపిని ‘నా బంగారు పుట్టలో వేలు పెడితే కుట్టనా?’ అని కుడున్నారనుకోవచ్చు. ఇది ప్రజాస్వామ్య దేశమని రాష్ట్రంలో ఏ పార్టీ అయినా ఎన్నికలలో పోటీ చేసి గెలిచి అధికారంలోకి రావచ్చునని కేసీఆర్ మనసులో అంగీకరించకపోవడం, ఎప్పటికీ తమ పార్టీ, తామే అధికారంలో ఉండాలని కోరుకోవడం వలననే కేసీఆర్ కాంగ్రెస్ను నిర్వీర్యం చేశారు. అప్రయత్నంగా బిజెపిని తెచ్చుకొని ఇప్పుడు బాధపడుతున్నారని చెప్పవచ్చు.
అయితే కేసీఆర్ ఇప్పటికైనా ప్రజాస్వామ్యానికి కట్టుబడేందుకు సిద్దపడితే ఇంత బాధ అనుభవించాల్సిన అవసరమే ఉండదు. తన పాలన, అభివృద్ధి, సంక్షేమ పధకాల గురించి ప్రజలకు చెప్పుకొని వారి ఆమోదంతో మళ్ళీ అధికారంలోకి రావచ్చు. కానీ బిజెపి తన రాజ్యాధికారాన్ని కబళించడానికి వచ్చిన శత్రువుగా కేసీఆర్ భావిస్తుండటంతో దాంతో యుద్ధం చేయవలసివస్తోంది. తెలంగాణ ప్రజలకు బిజెపిని బూచిగా చూపేందుకే కేసీఆర్ మోడీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారని చెప్పవచ్చు.
ఇక బిజెపికి దురాశ పెరిగిపోయిందని చెప్పక తప్పదు. దేశంలో ఒక్కో రాష్ట్రాన్ని వశపరుచుకొంటూ యావత్ దేశమంతా బిజెపియే అధికారంలో ఉండాలని కోరుకొంటోంది. ఈవిషయం ఆ పార్టీ నేతలే స్వయంగా చెప్పుకొంటున్నారు కూడా. అనాడూ చక్రవర్తులు మిగిలిన రాజులతో యుద్ధం చేసి వారిని సామంత రాజులుగా చేసుకొని తృప్తిపడేవారు. కానీ బిజెపి మాత్రం “సామంత రాజులొద్దు మా ఏకఛత్రాధిపత్యంలో మేమే దేశాన్ని పాలించుకొంటాం,” అన్నట్లు ఒక్కో ప్రజా ప్రభుత్వాన్ని కూల్చివేస్తోంది.
మహారాష్ట్ర, బిహార్, ఢిల్లీ, ఝార్ఖండ్, తెలంగాణ రాష్ట్రాలలో అదే చేస్తోంది. బిజెపి రాజ్యాధికార దురాశ వలననే ఈ రాజకీయ యుద్ధాలు అనివార్యం అయ్యాయని చెప్పక తప్పదు. అదే… కేంద్రంలో అధికారానికి పరిమితమయ్యి, ప్రజాస్వామ్య పద్దతిలో రాష్ట్రాలలో పోటీ చేసి అధికారంలోకి వచ్చి ఉంటే ఎవరూ బిజెపిని ఈవిదంగా వేలెత్తిచూపేవారు కారు.
కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు ప్రజాస్వామ్య ముసుగులో రాజ్యాధికారం కోసం ప్రయత్నిస్తుండటమే ఈ సమస్యకు మూలకారణం. ప్రజాస్వామ్యాన్ని, నైతిక విలువలను మరిచి యుద్ధాలు చేస్తున్నప్పుడు దానికి వారే మూల్యం చెల్లించకతప్పదని తెలంగాణలో టిఆర్ఎస్, బిజెపిల మద్య జరుగుతున్న యుద్ధమే నిరూపించబోతోంది.
Watch and subscribe for Exclusive Interviews:



