ఏపీ, తెలంగాణ సిఎంలు జగన్, కేసీఆర్ల ఆలోచనావిధానం, పాలనావిధానాలు, చివరికి వారి ప్రసంగాలలో కూడా ఎంతో తేడా కనిపిస్తుంటుంది.
బటన్ నొక్కుడు సభలలో మంత్రులు, ఎమ్మెల్యేల భజన సరిపోన్నట్లు మహిళలు, పిల్లల చేత కూడా పొగిడించుకొని చిద్విలాసంగా చిర్నవ్వులు నవ్వుతుంటారు. అప్పటి వరకు చిర్నవ్వులు చిందిన సిఎం జగన్, మైకు ముందుకు రాగానే తాను ఒంటరి వాడినైపోయానని, కనుక నన్ను మీరే ఆదుకోవాలంటూ దీనంగా వేడుకొంటారు!
కేసీఆర్ అభివృద్ధి అంతా ‘వర్తమానం నుంచి భవిష్యత్’ వరకు విస్తరించి ఉంటే, జగన్ అభివృద్ధి ‘కేవలం భవిష్యత్లో’ మాత్రమే ఉంటుంది. అంటే శిలాఫలకాలు, ఎంఓయులలోనే ఉంటుంది. ఈ నాలుగున్నరేళ్ళలో చేసిందేమీ లేకపోయినా తాను రాష్ట్రాన్ని అభివృద్ధి చేయబోతే కొన్ని దుష్టశక్తులు అడ్డుపడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తుంటారు.
సిఎం జగన్ ఇదివరకు మూడు రాజధానుల గురించి పదేపదే మాట్లాడేవారు. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ మూడు పెళ్ళిళ్ళ గురించి మాట్లాడుతుంటారు.
ఈ అభివృద్ధి ఇలాగే కొనసాగాలనుకొంటే బిఆర్ఎస్ పార్టీని గెలిపించమని కేసీఆర్ ప్రజలను కోరితే, మీకు ఇంకా ‘మేలు’ కావాలంటే మళ్ళీ ఈ ఒంటరి బిడ్డనే గెలిపించండని జగన్ కోరుతుంటారు.
కేసీఆర్ కూడా కాంగ్రెస్, బిజెపి నేతలను చాలా ఘాటుగానే విమర్శిస్తారు. అయితే అది చాలా సహేతుకంగా కళ్ళకు కట్టిన్నట్లు ఉంటుంది. ఆయా జిల్లాలో తన ప్రభుత్వం పూర్తిచేసిన పనుల గురించి పేర్కొంటూ, కాంగ్రెస్ పాలనలో ఎప్పుడైనా ఇటువంటి చూశారా?అని కేసీఆర్ ప్రశ్నిస్తారు.
ఆయా జిల్లాల గుండా కాలువలలో పారే సాగునీటిని, వాటితో పండే పంటల గురించి ప్రజలకు గుర్తుచేస్తారు. తమ కళ్లెదుట కనిపిస్తున్న ఆ అభివృద్ధి పనులను ప్రజలు కూడా లేదనలేరు. రాష్ట్రవిభజనకు ముందు తర్వాత తెలంగాణలో వచ్చిన ఈ మార్పును కళ్ళకు కట్టిన్నట్లు అచ్చమైన తెలంగాణ భాష, యాసలతో ప్రజల మనసులకు హత్తుకొనేలా వివరిస్తారు.
అదే… ఏపీ సిఎం జగన్ తెలుగు భాషలో మాట్లాడేందుకు కూడా తడబడుతుంటారు. ఎప్పుడూ ‘మేలు’ గురించే మాట్లాడుతుండటం వలన దానిలో కొత్త విషయాలు ఏమీ ఉండవు. పైగా వాటికి ముందూ వెనుక చంద్రబాబు, పవన్ భజన కూడా చేస్తుంటారు. ప్రజలు జగన్ నోట ఏదో వినాలని ఆశిస్తే ఆయన పదేపదే ఒకటే పాట పాడుతుండటంతో మద్యలో లేచి వెళ్ళిపోతుంటారు.
అదే… కేసీఆర్ ప్రసంగిస్తుంటే ఆయనను విమర్శించేవారు సైతం తన్మయత్వం తలలూపుతూ వింటారు.
కేసీఆర్, జగన్ ప్రసంగాలలో కనబడే మరో ముఖ్యమైన తేడా ఏమిటంటే, కేసీఆర్ తన ప్రసంగంలో రాష్ట్రాన్ని, జిల్లాను, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన మంత్రులు, ఎమ్మెల్యే, కలెక్టర్లు, ఉన్నతాధికారులు, పోలీస్ అధికారుల కృషి గురించి ప్రజలకు సభాముఖంగా తెలియజేసి వారిని ప్రశంసిస్తారు.
సాక్షాత్ ముఖ్యమంత్రి సభాముఖంగా తమ గురించి ప్రజలకు అంత గొప్పగా చెప్పి, తమను గౌరవిస్తే వారు ఎంత సంతోషంతో పొంగిపోతారో, కేసీఆర్ పట్ల కృతజ్ఞతగా వ్యవహరిస్తారో ఊహించుకోవచ్చు. అంతేకాదు వారు మరింత కష్టపడి పనిచేస్తూ ప్రభుత్వానికి మరింత మంచిపేరు తెస్తారు కూడా.
అదే… ఏపీ సిఎం జగన్ తనను మంత్రులు, ఎమ్మెల్యేలు, మహిళలు, స్కూలు విద్యార్థులు కూడా తనను వేదికపై పొగడాలని కోరుకొంటారు తప్ప ఫలానా మంత్రి, ఎమ్మెల్యే, అధికారి ఇంత అద్భుతంగా పనిచేశారనే చిన్న ప్రశంశ వినబడదు.
ఉద్యోగుల సంఘాలు కేసీఆర్ చిట్రపఠాలకు పాలాభిషేకాలు చేస్తుంటే, ఏపీలో ఉద్యోగ సంఘాల నేతలు జగన్ను చూసి భయపడి పొగుడుతుంటారు!
కేసీఆర్ ప్రసంగాలలో అభివృద్ధి… జగన్ ప్రసంగాలలో ఎంతసేపు ‘ప్రతీ ఇంటికీ చేసిన మేలు పేరు’ దాంతో బోలెడంత స్వోత్కర్ష, పరనింద వినిపిస్తుంటాయి.
ఇరువురు ముఖ్యమంత్రుల పనితీరులోనే కాదు… ప్రసంగాలు, వ్యవహారశైలిలో కూడా ఇంత తేడా కొత్తవచ్చిన్నట్లు కనిపిస్తుంటుంది. ఆశ్చర్యంగానే ఉంది కదా?



