ఒకప్పుడు కేసీఆర్ తనంతటివాడు ఈ దేశంలోనే లేడనుకున్నారు. ఈ కాంగ్రెస్, బీజేపిల నుంచి దేశాన్ని తాను మాత్రమే రక్షించగలనని గట్టిగా చెప్పుకున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్షాలను నిర్వీర్యం చేసి ‘నా మాటే శాసనం’ అన్నట్లు వ్యవహరించారు. తెలంగాణలో తనకు తిరుగేలేదని ధ్రువీకరించుకున్నాక దేశాన్ని ఉద్దరిద్దామని ప్రత్యేక విమానాలు వేసుకొని తిరిగారు. ఓ 500- 600 వందల కార్లు వేసుకొని ముందుగా మహారాష్ట్రపై దండయాత్రకు బయలుదేరి వెళ్ళారు.
కానీ తర్వాత ఏం జరిగిందో అందరూ చూశారు. దేశాన్ని ఏలాలనుకున్న కేసీఆర్ కనీసం తెలంగాణని కూడా ఏలుకునే పరిస్థితి కనిపించడం లేదు.
తాను ఎంతో ముచ్చటపడి నిర్మించుకున్న ప్రగతి భవన్ ఖాళీ చేసి దాదాపు రెండేళ్ళుగా ఫామ్హౌసులో కాలక్షేపం చేస్తున్నారు. తాను ఎంతో ముచ్చట పడి కట్టుకున్న సచివాలయంలోకి ఆయన అమితంగా ద్వేషించే రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నేతలు దానిలో దర్జాగా కూర్చుంటే కేసీఆర్ దానిలోకి అడుగుపెట్టలేకపోతున్నారు.
కూతురు కవితని కాపాడుకోవడానికి పార్టీని బీజేపిలో విలీనం చేసేందుకు సిద్దపడిన కేసీఆర్, ఇప్పుడు ఆమె బారి నుంచి పార్టీని కాపాడుకోవడం కోసం ఆమెనే బయటకు గెంటేశారు. ఇవన్నీ చాలా విచిత్రమైన, అనూహ్యమైన రాజకీయ పరిణామాలే కదా?
వీటన్నిటికీ కొస మెరుపు ఏమిటంటే, ఆయన కుమారుడు కేటీఆర్ చేసిన తాజా వ్యాఖ్యలు. “కేసీఆర్ కొరకు రాని కొయ్య. ఆయన ఉన్నంతకాలం తెలంగాణ రాజకీయాలలో తాము ఏమీ చేయలేమని కాంగ్రెస్, బీజేపిలకు బాగా తెలుసు. కనుక రెండు పార్టీలు కలిసి ఆయనని రాజకీయంగా నిర్వీర్యం చేయాలని కుట్రలు చేస్తున్నాయి. కనుక ఆయనను కాపాడుకోవలసిన బాధ్యత మన అందరి మీద ఉంది,” అని అన్నారు.
ఒకప్పుడు దేశాన్ని రాష్ట్రాన్ని, ప్రజలను కాపాడే లోక రక్షకుడినని సగర్వంగా చెప్పుకొని, పార్టీలో అందరి చేత చెప్పించుకున్న కేసీఆర్ని, ఇప్పుడు ప్రజలే కాపాడాలని కేటీఆర్ చెపుతున్నారు. ఇప్పుడు ఆయనని ప్రజలు కాపాడుకుంటే, ఆనక అయన వారిని కాపాడుతారట!
కానీ కేసీఆర్ని ఎన్నికలలో రేవంత్ రెడ్డి ఒక్కరే దెబ్బతీసి మూల కూర్చోబెట్టారు కదా?ఫామ్హౌసులో నుంచి బయటకు రావడానికే భయపడుతున్న కేసీఆర్ని దెబ్బ తీయడానికి కాంగ్రెస్, బీజేపిలు కలిసి కుట్ర చేయాల్సిన అవసరం ఏముంది?
అయినా దేవుడిని సామాన్య ప్రజలు కాపాడగలరా… దేవుడిని సాటి దేవుళ్ళే కాపాడుకోవాలి. సాటి దేవుళ్ళు ఎవరో కేటీఆర్కి బాగా తెలుసు.






