కేసీఆర్ మౌనమే బిఆర్ఎస్ కు శాపమయ్యిందా.?

KCR Political Silence

ఒక్క ఓటమి కేసీఆర్ ను ఇంతలా నిస్సహాయుడిని చేసిందా అన్నట్టుగా బిఆర్ఎస్ చుట్టూ వరుస వివాదాలు చెలరేగుతున్నా, రాజకీయాల కారణంగా తన సొంత కుటుంబం రెండు ముక్కలుగా చీలుతున్నా ఇప్పటివరకు కేసీఆర్ ఒక్క మాట కూడా ఎందుకు మాట్లాడలేకపోతున్నారు.? ఏ భయం కేసీఆర్ ను ఇలా మౌన ముద్రలో ఉంచగలుగుతుంది.?

ఒక పక్క కూతురు కవిత నన్ను ఉరితీశారు నాన్నా అంటూ ఆవేదన చెందుతుంది, మరో పక్క కవిత బిఆర్ఎస్ పార్టీకి పెను ప్రమాదం అంటూ కేటీఆర్, హరీష్ లు గోల చేస్తున్నారు. మరో పక్కన ప్రత్యర్థి పార్టీలు కాంగ్రెస్, బీజేపీ లు కల్వకుంట్ల ఇంటి పోరు అంటూ హేళనకు సిద్ధమవుతారు.

ADVERTISEMENT

వీటన్నిటికీ సమాధానం చెప్పడానికి, పార్టీ క్యాడర్ కు భరోసా కల్పించడానికి కేసీఆర్ ఖచ్చితంగా బయటకు రాక తప్పదు. ఒక ప్రకటన ఇవ్వక తప్పదు. లేదంటే ఇటు కవిత నుంచి అటు బిఆర్ఎస్ శ్రేణుల నుంచి ఆరోపణలు ప్రత్యారోపణలు జరుగుతూనే వస్తాయి. అవి పార్టీని మరింత బలహీన పరుస్తూనే ఉంటాయి.

నాడు కవిత అరెస్టు సమయంలోను కేసీఆర్ ఇదే తరహా మౌనాన్ని పాటించారు, నేడు పార్టీని ఈ పరిస్థితికి తీసుకొచ్చారు. ఇక కాళేశ్వరం విచారణ అంటూ ప్రభుత్వం దూకుడుగా ముందుకెళ్తున్నప్పుడు కేసీఆర్ స్పందించలేదు చివరికి సొంత కూతురు చేతే అవినీతి ఆరోపణలు ఎదుర్కోవాల్సిన దుస్థితిలో పడ్డారు.

కేసీఆర్ మౌనం బిఆర్ఎస్ ను అవినీతి సుడిగుండంలో నెట్టేస్తుందా.? ఇటు కాళేశ్వరం అంటూ ఒకపక్క ఫోన్ టాపింగ్ అంటూ మరోపక్క కాంగ్రెస్ ప్రభుత్వం బిఆర్ఎస్ ముఖ్యనాయకులను టార్గెట్ చేస్తూండుంటే కేసీఆర్ మాత్రం ఫామ్ హౌస్ సమావేశాలు నిర్వహిస్తూ కాలం వెళ్లదీస్తున్నారు.

దీనితో రాజకీయంగా పార్టీ పూర్తి బాధ్యతలను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు మోస్తున్నారు. అయితే వీరిద్దరూ తెరముందు కనిపిస్తుంటే సంతోష్ బిఆర్ఎస్ ను ముఖ్యంగా కేసీఆర్ ను తెరవెనుక నుండి నడిపిస్తున్నారు అనేలా కవిత ఆరోపిస్తున్నారు.

తన ఇన్నేళ్ల రాజకీయ ప్రయాణంలో కేసీఆర్ ప్రజా క్షేత్రంలోకి కాదు కదా కనీసం మీడియా ముందుకు కూడా రాలేని నిస్సహాయ స్థితిలోకి వెళ్లిపోయారా అంటూ కేసీఆర్ దీనస్థితిని చూసి ఉద్యమ పోరాటాల నాటి నేతలు ముక్కున వేలేసుకుంటున్నారు.

ADVERTISEMENT
Latest Stories