టిడిపి ఎంపీ కేశినేని నాని గత కొంతకాలంగా పార్టీపై అలిగి దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. అయితే మళ్ళీ చాలా రోజుల శుక్రవారం విజయవాడలో మీడియా ముందుకు వచ్చి చంద్రబాబు నాయుడుకి మద్దతుగా మాట్లాడారు. తాను టిడిపిలోనే ఉన్నానని, టిడిపి అభ్యర్ధిగానే పోటీ చేస్తానని స్పష్టం చేశారు.
ఇంతకీ ఆయన ఏమన్నారంటే, “దేశ రాజకీయాలలో ఎటువంటి అవినీతి మచ్చ అంటని అతికొద్దిమంది నాయకులలో చంద్రబాబు నాయుడు ఒకరు. ఆయన 40 ఏళ్ళ రాజకీయాలలో ఒక్క అవినీతి మచ్చ కూడా లేదు. ఆయనకు ఐటి నోటీసులు వచ్చాయని అంటున్నారు. అయితే ఇదేమీ పెద్ద విషయం కాదు. రాజకీయంగా ఆయనను ఇబ్బంది పెట్టేందుకే నోటీస్ ఇచ్చి ఉండవచ్చని నేను భావిస్తున్నాను. ఒకవేళ నోటీస్ ఇచ్చి ఉంటే దానికి ఆయన జవాబు చెప్పుకోగలరు. ఎందుకంటే ఆయన ఏనాడూ అవినీతికి, అక్రమాలకు పాల్పడలేదు కనుక ఆయన రికార్డ్ చాలా క్లీన్గా ఉంటుంది. నేను టిడిపిలోనే ఉన్నాను. వచ్చే ఎన్నికలలో టిడిపి అభ్యర్ధిగానే పోటీ చేస్తాను,” అని అన్నారు.
కేశినేని సోదరుల మద్య రాజకీయంగా విభేధాలు ఏర్పడినప్పుడు టిడిపి తనకు కాకుండా తమ్ముడు కేశినేని చిన్నికి మద్దతుగా నిలిచిందనే బాధతో కేశినేని నాని టిడిపికి దూరమయ్యారు. ఒకవేళ విజయవాడ సెంట్రల్ నుంచి తనకు కాక మరెవరికి లోక్సభ టికెట్ ఇచ్చినా తాను స్వతంత్ర అభ్యర్దిగా పోటీచేసి ఓడిస్తానని కేశినేని నాని హెచ్చరించారు. చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ పర్యటనలకు కూడా ఇంతకాలం దూరంగా ఉండిపోయారు.
బహుశః ఆయనకు చంద్రబాబు నాయుడు టికెట్ హామీ ఇచ్చి ఉండవచ్చు లేదా తనకు టికెట్ ఇవ్వాలని కోరుతూ టిడిపిలో కొనసాగేందుకు ఆయనే తిరిగి వచ్చిన్నట్లు భావించవచ్చు. అందుకే టిడిపి అభ్యర్ధిగా పోటీ చేస్తానని చెపుతున్నారనుకోవలసి ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కేశినేని నాని వంటి బలమైన నేతను టిడిపి వదులుకోవడం మంచిది కాదు. వదులుకొంటే టిడిపి, ఆయన కూడా నష్టపోయే ప్రమాదం ఉంటుంది.



