టిడిపి ఎంపీ కింజారపు రామ్మోహన్ నాయుడు, మాజీ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి, టిడిపి మండల అధ్యక్షులు కత్తిరి వెంకటరమణ, పార్టీ నేతలు హనుమంతు రామకృష్ణ, మట్ట పురుషోత్తం, లవకుమార్ తదితరులు మంగళవారం టెక్కలిలో టిడిపి కార్యాలయంలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
అనంతరం ఎంపీ కింజారపు రామ్మోహన్ నాయుడు మీడియాతో మాట్లాడుతూ, “మా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, బీసీ నాయకుడు కింజారపు అచ్చెన్నాయుడును భీమవరంలో అల్లూరి శత జయంత్యుత్సవాలకు ఆహ్వానించి, ఆ కార్యక్రమంలో పాల్గొననీయకుండా పోలీసులతో అడ్డుకొని వెనక్కు తిప్పి పంపేసి ఘోరంగా అవమానించారు. ప్రోటోకాల్ ఉల్లంఘించారు. జగన్ చేతిలో రాష్ట్రాన్ని పెట్టి ప్రజలు మోసపోయారు. మూడేళ్ళ పాలన ఎమర్జన్సీని తలపిస్తోంది.
ప్రభుత్వం పరిపాలనకు పరిమితం కావలసి ఉండగా ఇసుక మాఫియా, మద్యం మాఫియా చేస్తోంది. పరిపాలన చేతకాక అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టించేస్తోంది. నిత్యావసర సరుకులు, విద్యుత్, ఆర్టీసీ ఛార్జీలు పెంచుతూ సామాన్య ప్రజలపై పెను భారం మోపుతోంది. వైసీపీ నాయకులు భూబకాసురుల్లా తయారయ్యారు,” అని తీవ్రంగా విమర్శించారు.
ఈ సందర్భంగా స్థానిక ప్రజలు ఎంపీ కింజారపు రామ్మోహన్ నాయుడిని కలిసి బైదలాపురం వద్ద వంశధార కాలువపై వంతెన కూలిపోయిందని దాని స్థానంలో కొత్తది నిర్మించాలని తాము వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులతో ఎన్నిసార్లు మొరపెట్టుకొన్నప్పటికీ ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు, వంతెన కూలిపోవడంతో రోజూ రాకపోకలకు చాలా ఇబ్బందులు పడుతున్నామని చెప్పారు.
కింజారపు రామ్మోహన్ నాయుడు స్పందిస్తూ, నాబార్డు నిధులతో వంతెన నిర్మాణాన్ని పూర్తి చేయించేందుకు గట్టిగా ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు. గ్రామస్తుల అభ్యర్ధన మేరకు కింజారపు రామ్మోహన్ నాయుడు, పార్టీ నేతలు హనుమంతు రామకృష్ణ, మట్ట పురుషోత్తం, లవకుమార్ తదితరులతో కలిసి జలుమూరు మండలం కరకవలస పంచాయతీ కిట్టాలపాడుకి వెళ్ళి అక్కడ వంశధార కాలువపై శిథిలావస్థలో ఉన్న వంతెనను స్వయంగా చూసి, దాని స్థానంలో కొత్తది నిర్మించేందుకు గట్టిగా ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు.



