కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నేడు హైదరాబాద్లో మీడియాతో మాట్లాడుతూ, “దేశంలో మీడియా, ప్రతిపక్షాలన్నీ ప్రధాని మోడీని ఇతర అంశాలపై విమర్శిస్తుంటాయి తప్ప ఎవరూ అయన అవినీతికి పాల్పడ్డారని ఆరోపించడం లేదు. ఎందుకంటే ఆయన ఏనాడూ అవినీతికి పాల్పడలేదు.
వేలకోట్లు ఆస్తులు పోగేసుకోలేదు. తన కుటుంబ సభ్యులను, బంధుమిత్రులను చేరదీసి లబ్ది కలిగించలేదు. కనుక ఎవరూ ప్రధాని మోడీని అవినీతికి పాల్పడ్డారంటూ వేలెత్తి చూపించలేకపొతున్నారు,” అని కిషన్ రెడ్డి అన్నారు.
ఆయన చెప్పింది నూటికి నూరు శాతం నిజమేనని అందరికీ తెలుసు. కానీ అంబానీ, ఆదానీలకు దేశాన్ని దోచిపెడుతున్నారనే విమర్శలు వినిపిస్తూనే ఉన్నాయి.
నిరుపేద రైతుల రుణాలు మాఫీ చేయడానికి మీనమేషాలు లెక్కించే మోడీ ప్రభుత్వం, అంబానీ, అదానీ తదితర కార్పోరేట్ కంపెనీలకు లక్షల కోట్ల రుణాలు మాఫీ చేస్తున్నారని వార్తలు వస్తూనే ఉన్నాయి. ఆ భారాన్నే ఛార్జీళ రూపంలో సామాన్య ప్రజలపై వేస్తున్నారని విమర్శలు వినిపిస్తూనే ఉన్నాయి కదా?
అవినీతి అంటే అక్రమంగా డబ్బు లేదా ఆస్తులు పోగేసుకోవడం మాత్రమే కాదు. ఈవిదంగా కాకులను కొట్టి గద్దలకు వేయడం కూడా అవినీతే కదా?
నాడు డా.మన్మోహన్ సింగ్ పీవీ నరసింహారావు క్యాబినెట్లో ఆర్దికమంత్రిగా ఉన్నప్పుడు ఆర్ధిక సంస్కరణలు అమలుచేసి దేశాన్ని గట్టెక్కించినందుకు ఆయన పేరు యావత్ ప్రపంచంలో మారుమ్రోగిపోయింది.
కానీ ఆయనే దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టినప్పుడు వరుస కుంభకోణాలు, భారీగా అవినీతి జరిగేవి. ఆయన అవినీతికి పాల్పడనప్పటికీ ఆ మరకలు అయనకీ అంటుకున్నాయి కదా?అదేవిదంగా అదానీ గ్రూప్ అవినీతి మరకలు తప్పకుండా ప్రధాని మోడీకే అంటుకోకుండా ఉంటాయా?
విజయ్ మాల్యా వంటి వారు బ్యాంకులను మోసం చేసి దేశం విడిచిపారిపోతుంటే అడ్డుకున్నారా? కనీసం ఇన్నేళ్ళ తర్వాత అయినా వారిని వెనక్కు రప్పించ గలిగారా? అంటే లేదని అందరికీ తెలుసు.
కేంద్ర ప్రభుత్వం దేశంలో మావోయిస్టులను నిర్దాక్షిణ్యంగా ఏరిపారేస్తోంది. కానీ దేని కోసం శాంతి స్థాపన కోసమేనా? అంటే కాదంటున్నారు వామపక్ష నేతలు. మావోయిస్టులు అడవులలో ఉన్నంత కాలం వాటిలో నిక్షిప్తమై ఉన్న అమూల్యమైన బాక్సైట్, యురేనియం వంటి విలువైన ఖనిజాలు తవ్వకం అసాధ్యంగా మారింది.
కనుకనే శాంతి భద్రతలకు విఘాతం కల్పిస్తున్నారనే సాకుతో అందరినీ ఏరి పారేశాక గిరిజన అభివృద్ధి పేరుతో అడవులను అంబానీ, అదానీ తదితరులకు అప్పగించేయడం ఖాయమని వామపక్షాలు విమర్శిస్తున్నాయి కదా? అవునో కాదో రాబోయే రోజుల్లో ఎలాగూ కనిపిస్తుంది.
కనుక ప్రధాని మోడీకి అవినీతి మరక అంటలేదని కిషన్ రెడ్డి లేదా మరొకరు సర్టిఫికేట్ ఇస్తే అది చెల్లదు. దేశ ప్రజలు కూడా ఇస్తేనే చెల్లుతుంది.






