కొడాలికే నోటి శుద్ధి ఉండి ఉంటే…

YS-Sharmila-Kodali-Nani

మాజీ మంత్రి, గుడివాడ వైసీపి ఎమ్మెల్యే కొడాలి నాని మీడియా ముందుకు వస్తే బూతులు లేకుండా మాట్లాడలేరు. అలాగే ఎంతటివాడినైనా వాడూ, వీడూ… అంటూ చాలా చులకనగా మాట్లాడుతుంటారు. రాజకీయ నాయకులకు ఉండకూడని దుర్లక్షణాలే ఇవి. కానీ ఇదే ఆయన బలహీనత…బలం కూడా!

కొడాలి నానికి నోటి శుద్దే ఉండి ఉంటే, వైసీపిలో అందరికంటే మంచి మాటకారి, రాజకీయ ఉద్దండుడుగా మంచి పేరు సంపాదించుకుని ఉండేవారు. కానీ ఆయన మాస్ సినిమాలు తీసే మాస్ డైరెక్టర్ వంటివాడు. కనుక ఆయన నోరు విప్పితే బూతులే వస్తాయి.

ADVERTISEMENT

కనుక ఆయన ఎంత చక్కటి పాయింట్స్ మాట్లాడినప్పటికీ, ప్రత్యర్ధులపై ఎంత నిశిత విమర్శలు చేసినప్పటికీ, వాటన్నిటినీ ఆయన మాట్లాడే బూతు భాషే మింగేస్తుంటుంది.

కనుక ప్రజలకు ఆయన మాటలలో చెప్పే విషయం కంటే, ఆయన భాషే వినిపిస్తుంటుంది. అందుకే ఆయన సినీ ఇండస్ట్రీలో హిట్ కొట్టలేని గొప్ప డైరెక్టర్‌లా మిగిలిపోయారని చెప్పవచ్చు.

ఇంతకీ విషయం ఏమిటంటే, కొడాలి నాని ఈసారి వైఎస్ షర్మిలని టార్గెట్ చేసుకుని తీవ్ర విమర్శలు చేశారు. “తెలంగాణలో పార్టీ పెట్టుకొని తండ్రి పేరు చెప్పుకుని తిరుగుతూ, ఆయన పరువు తీసేసింది. తన తండ్రికి, అన్నకు, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి కూడా ద్రోహం చేసిన మురికి మూసీ నది వంటి కాంగ్రెస్ పార్టీలో తన పార్టీని విలీనం చేసేసింది.

తెలంగాణలో వైఎస్ కుటుంబం పరువు తీసినది చాలక మళ్ళీ ఏపీలో కూడా సొంత అన్నని నోటికి వచ్చిన్నట్లు విమర్శిస్తూ పరువు తీసేస్తోంది. వైఎస్ కుటుంబానికి బద్ధ శత్రువులతో చేతులు కలిపి అన్నకు ద్రోహం చేస్తోంది.

అన్నిటికీ ఒకటే మంత్రం అన్నట్లు, ఏపీకి ప్రత్యేక హోదా రావాలంటే కాంగ్రెస్‌ రావలంటుంది. పోలవరం అంటే కాంగ్రెస్‌ అంటుంది. విశాఖ స్టీల్ ప్లాంట్ అంటే కాంగ్రెస్‌ అంటుంది. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలంటుంది. అసలు వాడు (రాహుల్ గాంధీ) ఎంపీగా కూడా గెలవలేడు.

దేశంలో 25 రాష్ట్రాలలో కాంగ్రెస్‌ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. ఇండియా కూటమి అప్పుడే ముక్కలు ముక్కలైపోతోంది. ఈసారి ఎన్నికలలో బీజేపీ 350 సీట్లు గెలుచుకొని మళ్ళీ మోడీ ప్రధాని అవుతాడని సర్వేలన్నీ చెపుతున్నాయి.

మరి వాడు (రాహుల్ గాంధీ) ప్రధాని ఎలా కాగలడు? ప్రధాని కానప్పుడు దేనిపై సంతకం పెడతాడు? కేంద్రంలో, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో కాంగ్రెస్‌ గెలిచి అధికారంలోకి రాదని తెలుస్తున్నప్పుడు వైఎస్ షర్మిల మాట్లాడే ఈ మాటలకు అర్దం ఉందా అసలు?

ఈసారి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఏదో మాయ చేసేయబోతోందని, జగన్‌ పని అయిపోయిందని చెప్పుకు తిరుగుతున్నారు. కానీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి ఈసారి జీరో ఓటుతో ప్రజలు బుద్ధి చెపుతారు,” అని ఎమ్మెల్యే కొడాలి నాని అన్నారు.

ADVERTISEMENT
Latest Stories