గన్నవరం టికెట్ వంశీకే.. ఎవరూ అడగొద్దు: కొడాలి నాని

kodali-nani-vallabhaneni-vamsiరాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న వైసీపీ ప్లీనరీ సమావేశాలు వచ్చే ఎన్నికలలో ఆయా నియోజకవర్గాలలో ఎవరెవరు టికెట్ కోసం పోటీ పడుతున్నారో, వారిలో ఎవరిది పైచేయిగా ఉందో తేల్చుకోవడానికన్నట్లు సాగుతున్నాయి. గురువారం గన్నవరం నియోజకవర్గ ప్లీనరీ సమావేశం దావాజీగూడెంలో స్థానిక కళ్యాణ మండపంలో జరిగింది.

దానికి గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తప్ప నియోజకవర్గంలో టికెట్ ఆశిస్తున్నవారందరూ హాజరయ్యారు. ఆయన ఇటీవల అస్వస్థతకు గురవడంతో ఈ సమావేశానికి హాజరుకాలేదని మాజీ మంత్రి పేర్ని నాని చెప్పారు.

ADVERTISEMENT

వైసీపీ ప్లీనరీ సమావేశంలో పార్టీ పరిస్థితి గురించి చర్చించి నియోజకవర్గంలో నేతలు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తారని ఆశించడం సహజం. కానీ సమావేశంలో పాల్గొన్న వైసీపీ మాజీ మంత్రులు, నేతలు అందరూ ఒకరి తరువాత మరొకరు చంద్రబాబు నాయుడు, నారా లోకేష్‌లను విమర్శించడానికి పోటీ పడ్డారు.

ముఖ్యంగా తాజా మాజీ కొడాలి నాని ఎప్పటిలాగే చంద్రబాబు నాయుడుని లక్ష్యంగా చేసుకొని తీవ్ర విమర్శలు చేశారు. కొడాలి నాని మైక్ పట్టుకొంటే ఏమి మాట్లాడుతారో పార్టీలో అందరికీ తెలుసు. కనుక ఆయన పైశాచికానందంలో వారు పాలుపంచుకోక తప్పలేదు. అయితే వేదిక మీద ఉన్న సీనియర్ నేతలతో పాటు వైసీపీ కార్యకర్తలు అందరూ ఉలిక్కిపడే ఓ మాట కొడాలి నాని చెప్పారు.

“వచ్చే ఎన్నికలలో గన్నవరం నియోజకవర్గం టికెట్ మళ్ళీ వల్లభనేని వంశీకే ఇద్దామని సిఎం జగన్మోహన్ రెడ్డి స్వయంగా నాతో చెప్పారు. వ్యక్తులను చూసి కాకుండా మన అధినేత జగన్మోహన్ రెడ్డి నిర్ణయాన్ని బట్టి మనమందరం నడుచుకోవాలి. కనుక జగనన్న ఎవరిని అభ్యర్ధిగా నిర్ణయిస్తే వారికే అందరూ మద్దతు ఇవ్వాలి. ఈ విషయంలో మరో ఆలోచనకే తావు లేదు,” అని కొడాలి నాని అన్నారు.

‘వ్యక్తులను చూసి కాకుండా మన అధినేత జగన్మోహన్ రెడ్డి నిర్ణయాన్ని బట్టి మనమందరం నడుచుకోవాలని’ కొడాలి నాని చెప్పడం చూస్తే వల్లభనేని వంశీకి మళ్ళీ టికెట్ ఇవ్వడం ఆయనకు కూడా ఇష్టం లేదని కానీ జగన్ నిర్ణయాన్ని కాదనలేక మద్దతు ఇవ్వక తప్పదని చెపుతున్నట్లు అర్దమవుతూనే ఉంది.

గన్నవరం టికెట్ మళ్ళీ వల్లభనేని వంశీకే అని చెప్పడం ద్వారా కొడాలి నాని పార్టీలో అసమ్మతి సెగలు రాజేశారని చెప్పవచ్చు. టికెట్ ఆశిస్తున్న ఇద్దరు వైసీపీ నేతలు దీనిపై ఏవిదంగా స్పందిస్తారో త్వరలోనే చూడవచ్చు.

ADVERTISEMENT
Latest Stories