మొన్నటి దాక నాకు మంత్రి పదవి కావాలి అంటూ రచ్చ చేసిన రాజగోపాల్ ఇక ఇప్పుడు నాకు మంత్రి పదవీ ఎందుకు ఇయ్యరు అంటూ లొల్లి మొదలుపెట్టారు. పార్టీలో ఇద్దరు అన్నదమ్ములు ఉంటే ఆ కారణంతో నాకు మంత్రి పదవి రాకుండా అడ్డుకుంటారా.?
అన్నదమ్ములం ఇద్దరం సమర్థులైన నాయకులమే, కాబట్టి నాకు మంత్రి ఇస్తే తప్పేంటి.? పార్టీ పదవులకు అడ్డువచ్చిన బంధుత్వం పార్టీ పటిష్ఠతకు అడ్డుకాలేదా.? మేము ఇద్దరం అన్నాతమ్ముళ్ళం అన్న విషయం పార్టీలోకి ఆహ్వానించేటప్పుడు తెలియదా.? నాకు మంత్రి పదవి హామీ ఇచ్చినప్పుడు గుర్తులేదా.?
9 మంది ఎమ్మెల్యేలు ఉన్న ఖమ్మం లో ముగ్గురు మంత్రులు ఉంటే తప్పుకానిది, 11 మంది ఎమ్మెల్యే లు ఉన్న నల్గొండ కు ముగ్గురు మంత్రులు ఉంటే తప్పా.? అంటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ రాష్ట్ర స్థాయి నాయకత్వం నుండి ఢిల్లీ అధిష్టానం వరకు తన ఆవేదనను ప్రశ్నల రూపంలో వెళ్లగక్కారు.
కాంగ్రెస్ లో ఈ పదవుల పంచాయితీ, ఆధిపత్య లొల్లి తగువులు కొత్తేమి కాదు, కానీ పార్టీలో అత్యంత సీనియర్ నాయకులను కాదని, వేరే పార్టీ నుంచి వలస వచ్చిన నాయకుడిని కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ప్రకటించడంతోనే కాంగ్రెస్ లో అసమ్మతి కట్టలు తెంచుకుంటుంది అనుకున్న సందర్భంలో అది జరగలేదు.
పదేళ్ల తరువాత కాంగ్రెస్ చేతికి అందిన అధికారాన్ని ఇలా అంతర్గత వివాదాలతో, బహిర్గత విమర్శలతో చేజార్చుకోవడం ఎందుకులే అనుకున్నారో.? లేఖ అధిష్టానమే రేవంత్ నాయకత్వాన్ని ఒప్పుకుని తీరాల్సిందే అన్న అల్టిమేటం జారీ చేసిందో కానీ ముఖ్యమంత్రి నుంచి మొదటి విడుత మంత్రి వర్గ విస్తరణ వరకు తెలంగాణ కాంగ్రెస్ లో అంతర్గత విభేదాలు బయటకు రాలేదు.
కానీ రెండవ స్థాయి మంత్రి వర్గ విస్తరణతో రాజగోపాల్ రగడ రేవంత్ సర్కార్ ను నీడలా వెంటాడుతుంది. రేవంత్ రెడ్డే తన మంత్రి పదవికి అడ్డుపడుతున్నారు అనేలా రాజగోపాల్ పరోక్ష విమర్శలు చేస్తున్నారు. అయినా రేవంత్ నుంచి ఎటువంటి ప్రతిస్పందన రావడం లేదు.
అలాగే రేవంత్ ను కాదని ఆయనకు వ్యతిరేకంగా రాజగోపాల్ రెడ్డి కి మద్దతు తెలిపేందుకు ఆయన అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి సైతం అడుగు ముందుకేయడం లేదు. తెరవెనుక రాజకీయాలే కానీ తెర ముందు విమర్శలకు ఏ ఒక్క ముఖ్య నాయకుడు సాహసించక పోవడంతో రాజగోపాల్ మంత్రి పదవి లొల్లి కి ఇతర నేతల నుంచి రాజకీయ మద్దతు కరువయ్యింది.






