కొండా సురేఖ మంత్రి పదవి బర్తరఫ్ తరువాత కాంగ్రెస్ పార్టీలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. నిన్న మొన్నటి వరకు సీఎం రేవంత్ టార్గెట్ గా ప్రత్యక్ష, పరోక్ష విమర్శలు చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వైఖరిలో ఇప్పుడు స్పష్టమైన మార్పు కనిపిస్తుంది.
మంత్రి పదవి కోసం ఎన్నో రోజులుగా కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న కోమటిరెడ్డి కి సురేఖ ను మంత్రి పదవి నుంచి తొలగించడం అందివచ్చిన ఒక అవకాశంగా మారింది. దశాబ్దాల పాటు కాంగ్రెస్ పార్టీతో రాజకీయ అనుబంధాన్ని కొనసాగించిన కొండా కుటుంబాన్ని కాదని కాంగ్రెస్ అధిష్టానం టీడీపీ నుంచి వలస వచ్చిన సీఎం రేవంత్ అభిప్రాయానికి విలువ నిచ్చి రేవంత్ కు వ్యతిరేకంగా గళం విప్పితే వేటు తప్పదు అనేలా సురేఖను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేసింది.
ఈ సందర్భంలో అధిష్టానం వద్ద సీఎం రేవంత్ రేంజ్ ఏంటి అనేది పార్టీలోని మిగిలిన అసమ్మతి నేతలకు తెలిసివచ్చిందనే చెప్పాలి. దానిలో భాగంగానే గతంలో కోమటిరెడ్డి రేవంత్ పై బెదిరింపులతో దాటిన తన గీతలను ఇప్పుడు బుజ్జగింపులతో చెరిపేయాలని చూస్తున్నారా అన్నట్టుగా పరిస్థితులు మారిపోతున్నాయి.
ఎప్పుడు ఉప్పు నిప్పు మాదిరి కనిపించే రేవంత్ – రాజగోపాల్ ఇప్పుడు అందుకు భిన్నంగా పార్టీ క్యాడర్ కి దర్శనమిచ్చారు. నేడు నకిరికల్ సభలో పాల్గొన్న ఈ ఇరువురి నేతలు ఆత్మీయాయంగా పలకరించుకుంటూ ఒకరి మీద మరొకరు ప్రశంసలు కురిపించుకున్నారు.
తనకు సీఎం రేవంత్ కి మధ్య ఒకటిరెండు విషయాలలోనే ఆభిప్రాయ బేధాలు వచ్చాయని, తనకు, రేవంత్ కి మధ్య ఎటువంటి వ్యక్తిగత వైరాలు లేవని, సీఎం సొంత నియోజకవర్గమైన కొండగల్, ఉపముఖ్యమంత్రి నియోజకవర్గమైన మధిర స్థాయిలోనే తన మునుగోడు నియోజకవర్గ అభివృద్ధికి కూడా దాదాపు రూ. 2 వేలకోట్ల నిధులొచ్చాయని గతంలో రేవంత్ కి తనకి మధ్య ఉన్న గ్యాప్ కి ప్యాచ్ అప్ చేసే పనిలో పడ్డారు కోమటిరెడ్డి.
దీనితో సురేఖ మంత్రి పదవి దాదాపు కోమటిరెడ్డి కి ఖాయమయ్యిందా అంటూ కాంగ్రెస్ పార్టీలోనే అంతర్గత చర్చ మొదలయ్యింది. మరి రేవంత్ – కోమటరెడ్డి మధ్య ఏర్పడిన ఈ అనుబంధం మంత్రి పదవి పేరు ప్రకటనతో మరింత బలపడుతుందా.? లేదా ఇంకాస్త బలిహీనమవుతుందా.? అన్నది చూడాలి.





