కేసీఆర్‌ ఎదురు చూస్తున్న ఆ ఘడియలు వచ్చేశాయా?

KCR Remarks as Telangana Congress Crisis Deepens

కాంగ్రెస్‌ పార్టీని ఎవరూ ఓడించలేరు. కాంగ్రెస్‌ నేతలే తమ పార్టీని గద్దె దించుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు, ఇతర పార్టీలు ఎన్నికలలో గెలిచి అధికారంలోకి వస్తుంటాయి.. అనే మాట ఇప్పటిది కాదు. చాలా కాలంగా వినిపిస్తూనే ఉంది. ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ కూడా ఈ దశకు చేరుకున్నట్లే ఉంది.

మంత్రి కొండా సురేఖ కుమార్తె సుష్మిత ఇటీవల ఓ కార్యక్రమంలో సిఎం రేవంత్‌ రెడ్డి, ఆయన సోదరులపై అవినీతి ఆరోపణలు చేశారు. టికెట్స్ ఖరారు చేయడానికి ఆయనెవరు? గట్టిగా మాట్లాడితే ఢిల్లీ నుంచి సీల్డ్ కవరులో మరో సిఎం పేరు వస్తుంది జాగ్రత్త,” అంటూ హెచ్చరించారు.

ADVERTISEMENT

ఇక్కడే తెలంగాణ కాంగ్రెస్‌ పతనానికి తొలి బీజం పడింది. మరో సీనియర్ నేత చిన్నారెడ్డిపై కూడా వేటు వేసేందుకు సిఎం రేవంత్‌ రెడ్డి సిద్దపడ్డారు.

మొన్న సిఎం రేవంత్‌ రెడ్డికి బంగారు రాఖీ కట్టి రాజీకి ప్రయత్నించిన మంత్రి కొండా సురేఖ, తనపై వేటు తప్పదని తేలడంతో నేడు స్వరం మార్చారు.

“నాపై వేటు వేయాలంటే ముందుగా సిఎం రేవంత్‌ రెడ్డిపైనే వేటు వేయాలి, ఆయన గురించి నా కూతురు అన్నదాంట్లో తప్పేముంది? ఆయన తప్పు చేస్తే చూసి చూడనట్లు ఊరుకొని, ఆ తప్పులను నా కూతురు ఎత్తి చూపినందుకు నాపై వేటు వేస్తానంటే రాష్ట్రంలో బీసీలు ఊరుకుంటారా?” అని ప్రశ్నించారు.

ఆమె కూతురు వరంగల్‌ జిల్లాలో ఈవిధంగా మాట్లాడినందుకే కథ ఇంత దూరం వచ్చింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి క్యాబినెట్లో మంత్రిగా ఉన్న కొండా సురేఖ, ఢిల్లీలో “మా ముఖ్యమంత్రి అవినీతిపరుడు” అని చెప్తే కాంగ్రెస్‌ అధిష్టానం చూస్తూ ఊరుకుంటుందా? ఒకవేళ ఊరుకోకపోతే కొండా సురేఖ ఊరుకుంటారా? కనుక తాడోపేడో తేల్చేసుకోక తప్పదు. లేకుంటే ఇక నుంచి ఆమె సిఎం రేవంత్‌ రెడ్డికి పక్కలో బల్లెంలా మారవచ్చు.

రేవంత్ రెడ్డి పనిలో పనిగా మంత్రివర్గ విస్తరణ, మార్పులు చేర్పులకు కూడా సిద్ధమయ్యారు. దీనిలో మరో ఇద్దరు సీనియర్ మంత్రులకు ఉద్వాసన చెప్పబోతున్నట్లు ఊహాగానాలు వినిపిస్తుండటంతో వారు కూడా ఢిల్లీ చేరుకొని ఈ పంచాయితీలో జాయిన్ అయ్యారు.

ఇంటికి మంటలు అంటుకొని ఒకడు ఏడుస్తుంటే, చుట్టకు నిప్పు దొరికిందని మరొకడు సంతోషపడ్డాడత. అలాగే తెలంగాణ కాంగ్రెస్‌లో మంత్రి పదవులు ఆశిస్తున్నవారి హడావుడీ మొదలైపోయింది.

వారిలో మంత్రి పదవి దక్కక రెండేళ్ళుగా తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్న మునుగోడు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా ఒకరు.

ఈరోజు అయన నల్గొండలో మీడియాతో మాట్లాడుతూ, “నాకు మంత్రి పదవి ఇస్తానని హామీ ఇచ్చి రెండేళ్ళయింది. కానీ ఇవ్వకపోగా క్రమశిక్షణ ఉల్లంఘిస్తున్నాడంటూ నన్ను బయటకు పంపించే ప్రయత్నం చేస్తున్నారు. బయట నుంచి వచ్చిన వాళ్ళు పార్టీలో ఉన్నత పదవులు చేపట్టి, మా వంటి నిజమైన కాంగ్రెస్‌ నేతలను బయటకు పంపించే ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి వాళ్ళ నుంచి కాంగ్రెస్‌ పార్టీని కాపాడుకుంటాము. ఏనాటికైనా నేను ముఖ్యమంత్రి అవుతా,” అన్నారు. అంటే ఇక్కడ మరో టైమ్‌ బాంబు పెలేందుకు సిద్ధంగా ఉందన్న మాట!

మంత్రివర్గ విస్తరణలో ఎవరినైనా పీకేస్తే వాళ్ళు కూడా మొదలెట్టేస్తారు. ఒకవేళ ఈ బెదిరింపులకు భయపడి ఎవరిపై వేటు వేయకపోయినా, మంత్రివర్గ విస్తఃరణ చేపట్టకపోయినా అది, కాంగ్రెస్‌ అధిష్టానం, సిఎం రేవంత్‌ రెడ్డి బలహీనతకు నిదర్శనంగా నిలుస్తుంది. కనుక అప్పుడు మరిన్ని ధిక్కార స్వరాలు వినిపించే అవకాశం ఉంటుంది.

కనుక కేసీఆర్‌ చెప్పినట్లు కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్‌ పార్టీ కూల్చాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్‌ నేతలు వారంతట వారే కూల్చేసుకొని ఆయనకి అప్పగిస్తారేమో?

ADVERTISEMENT
Latest Stories