తెలంగాణ మహిళా మంత్రి కొండా సురేఖ తన ప్రత్యర్ది పార్టీ నేత కేటీఆర్ పై విమర్శలు చేసే నేపథ్యంలో హీరోహిన్ సమంత వ్యక్తిగత విషయాల పై చేసిన వ్యాఖ్యలు కేసుల రూపంలో సురేఖ మెడను చుట్టుకున్నాయి.
ఫోన్ టాపింగ్ కేసు, హీరోహిన్ సమంత విడాకుల విషయంలో మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల పై మాజీ మంత్రి కేటీఆర్, సురేఖ పై కోర్ట్ లో పరువు నష్టం కేసు దాఖలు చేసారు. అయితే దాని పై విచారణ చేపట్టిన నాంపల్లి కోర్ట్ మంత్రి సురేఖ పై క్రిమినల్ కేసు నమోదు చెయ్యాలంటూ ఆదేశాలు జారీ చేసింది.
ఈ నెల 21 లోగా ఆమె పై కేసు నమోదు చేయాలనీ, ఆ పై నోటీసులు ఇవ్వాలని న్యాయస్థానం అధికారులను ఆదేశించింది. అయితే హీరో నాగ చైతన్య, సమంత వైవాహిక జీవితానికి విడాకులతో బ్రేకులు వేసేందుకు కేటీఆర్ ఫోన్ టాపింగ్ కార్యక్రమాలే కారణం అంటూ గతంలో సురేఖ ఆరోపణలు చేసారు.
ఈ రాజకీయ విమర్శలలోకి సినీ సెలబ్రెటీలను లాగడం, వారి వ్యక్తిగత విషయాలను ప్రస్తావిస్తూ ప్రత్యర్థి పార్టీల నేతలకు చెక్ పెట్టాలనుకోవడం ఆమోదయోగ్యంగా లేదని, ఒక మహిళా నేతగా ఉంటూ మరో మహిళ వ్యక్తిత్వాన్ని గురించి కించపరిచి మాట్లాడడం అన్యాయమంటూ నాడు టాలీవుడ్ మొత్తం ఏకతాటి మీదకొచ్చి ముక్తకంఠంతో మంత్రి వ్యాఖ్యలను ఖండించారు, సమంతకు మద్దతుగా నిలిచారు.
అలాగే ఈ వివాదంలోకి సురేఖ సమంతతో పాటుగా అక్కినేని కుటుంబాన్ని కూడా లాగడంతో సురేఖ పై నాగార్జున కూడా పరువు నష్టం కేసు నమోదు చేసారు. మరి ఈ కేసులోనైనా కొండాకు ఊరట దక్కుతుందో లేక మరో క్రిమినల్ కేసు నెత్తెనేసుకుంటుందో చూడాలి.






