ఆంధ్రప్రదేశ్ లో జరగబోయే ఎన్నికల కురుక్షేత్రంలో తన వంతు పాత్ర పోషించేందుకు ‘సిద్ధం’ అంటూ ముందుకొస్తున్నారు తెలంగాణ అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ. కాంగ్రెస్ పార్టీ తరుపున ఏపీసీసీ అధ్యక్షురాలుగా ఉన్న షర్మిలకు మద్దతుగా ప్రచారం చేసేందుకు ఏపీ లో పర్యటించడానికి సిద్ధంగా ఉన్నానంటూ ప్రకటించారు సురేఖ.
దీనితో జగన్ కు వ్యతిరేకంగా పనిచేయడానికి తెలంగాణ నుంచి మరో సోదరి ఏపీకి రానున్నారు. రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణ వైస్సార్ పార్టీ తరుపున విస్తృతంగా ప్రచారం చేసి జగన్ కు మద్దతుగా నిలబడిన కొండా దంపతులు జగన్ ఆడిన రాజకీయ క్రీడలో బలైపోయారు. దశబ్ద కాలం పాటు తమకు రాజకీయ భవిష్యత్ లేకుండా చేసిన జగన్ పార్టీ కి కొండా సురేఖ తనవంతు భాగంగా రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి సిద్ధమయ్యారు.
ఇప్పటికే తెలంగాణ నుంచి ఏపీ రాజకీయాలకు షిఫ్ట్ అయిన షర్మిల జగన్ కు కంటి మీద కునుకు లేకుండా చేసి తన విమర్శల పదును పెంచుకుంటూ, రాజకీయంగా జగన్ ను దెబ్బ కొడుతున్నారు. అలాగే జగన్ మరో సోదరి వివేకా కుమార్తె కూడా షర్మిలతో జతకట్టడంతో సునీత కూడా కాంగ్రెస్ పార్టీ తరుపున జగన్ కు వ్యతిరేకంగా పనిచేయడానికి ‘నేను కూడా సిద్ధం’ అనే సంకేతాలు పంపుతున్నారు.
వీరిద్దరికి తోడు ఇప్పుడు వైస్సార్ కుటుంబానికి అత్యంత సన్నిహిత సంబంధాలు కలిగిన కొండా సురేఖ కూడా జగన్ ఓటమిని కోరుకోవడం, అందుకు తనవంతు కృషి తాను చేస్తానని చెప్పడం చూస్తుంటే ఈసారి జగన్ ఎన్నికలను ఎదుర్కోవడం అంటే ఆడవారితో యుద్ధం చేయడమే అన్నట్టుగా మారిపోయింది. ఇక మిగిలింది తల్లి విజయలక్ష్మి ఒక్కటే, ఆమె కూడా తన అడుగు ఎటువైపో అనేది తేల్చుకుని కూతురా,కొడుకా అనే నిర్ణయానికి వచ్చి ‘సిద్ధం’ అంటే ఇక జగన్ రాజకీయ భవిష్యత్ “ఒక్క ఛాన్స్ తో ఆగనుందా…లేక మరో ఛాన్స్ తీసుకోనుందా”..? అనేది ఒక క్లారిటీ వస్తుంది.
ఇప్పటికే పవన్ కళ్యాణ్, రఘురామా, షర్మిల, సునీత,రేవంత్ రెడ్డి ను బాబు మనుషులుగా ముద్రవేసి తమ రాజకీయ పబ్బం గడుపుకుంటున్న వైసీపీ నేతలకు కొండా సురేఖ ను కూడా ఆ లిస్ట్ లో యాడ్ చేయడం పెద్ద సమస్య కాకపోవచ్చు. రేపు జగన్ తల్లి విజయలక్ష్మి కూడా జగన్ కు వ్యతిరేకంగా ఒక్క మాట మాట్లాడిన ఆమెను కూడా బాబు దగ్గర ప్యాకేజీ తీసుకున్న వ్యక్తిగా చిత్రీకరించడానికి, ప్రచారం చేయడానికి చేతిలో సొంత మీడియా, సొంత పత్రిక అందుబాటులోనే ఉంది.
కాబట్టి ఇపుడు సాక్షి కథనాలతో “వైస్ షర్మిల మురుసుమల్లి షర్మిలాగా మారిపోయినట్లు అప్పుడు వైస్ విజయమ్మ….ఎలా మారుతుందో” ఆ బ్లూ మీడియా వారికి, వైకాపా నాయకులకే తెలియాలి.




