తెలుగు సినీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ బ్రహ్మాజీ నటన గురించి ఈ రోజు కొత్తగా చెప్పేదేముంది. కానీ, బ్రహ్మాజీలో ఈ స్థాయి నటుడు ఉన్నాడని గుర్తించింది మాత్రం దర్శకుడు కృష్ణవంశీనే. తన కెరీర్ తొలినాళ్ళల్లో చేసిన ఒక చిన్న సహాయాన్ని దృష్టిలో పెట్టుకుని తనకు ఎన్నో అవకాశాలు ఇచ్చాడంటూ కృష్ణవంశీ గురించి బ్రహ్మాజీ ఎన్నో విశేషాలు చెప్పుకొచ్చారు.
‘తనకు తెలియకుండానే చేసిన సహాయంతో, నిన్ను హీరోగా పెట్టి ఒక సినిమా చేస్తానని చెప్పాడని, అందులో భాగంగానే ‘సింధూరం’ సినిమాను నాతో తెరకెక్కించారని’ బ్రహ్మాజీ చెప్పుకొచ్చారు. ఇంతకీ బ్రహ్మాజీ చేసిన సాయం వింటే అవాక్కవుతారు. ఎప్పుడో కృష్ణవంశీ రెండు రోజులుగా భోజనం చేయకుండా ఆర్ధికంగా ఇబ్బందులు పడుతూ తినటానికి కూడా డబ్బులు లేని సమయంలో… ఆ రోజు కాకతాళీయంగా కలిసి, భోజనం చేద్దామని ఇద్దరం తిన్నామని, అది మదిలో పెట్టుకుని తనకు ఎంతో చేసాడని కృష్ణవంశీ గురించి బ్రహ్మాజీ చెప్పారు.
నిజానికి వంశీ నాడు రెండు రోజులుగా భోజనం చేయలేదన్న విషయం తనకు అస్సలు తెలియదని, కేవలం ఆ సమయం అయ్యిందని తానూ అడిగానని చెప్పుకొచ్చారు. ‘గులాభి’తో తన కెరీర్ మలుపుతిప్పిన కృష్ణవంశీ, ఆ తర్వాత ‘నిన్నేపెళ్ళాడతా, చంద్రలేఖ’ సినిమాలతో డిఫరెంట్ రోల్స్ ఇచ్చాడని, అంత చేసిన కృష్ణవంశీ రుణం తానూ తీర్చుకోలేనని, దేవుడు ప్రత్యక్షమై నాకు వరమిచ్చినా వంశీ రుణం తీరదని, తానూ తీర్చుకోలేనని, ప్రస్తుతం తన తనయుడు కూడా కృష్ణవంశీ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడని, ఒక రకంగా తానూ ఈ స్థితిలో ఉండడానికి కారణం తనేనని అన్నారు.
సాధారణంగా ఒకరికి భోజనం పెట్టిస్తే… తర్వాత వారు పైకొస్తే వారికి తగ్గ స్థాయిలో ఏ ఫైవ్ స్టార్ హోటల్ కు తీసుకువెళ్లి మంచి భోజనం పెట్టిస్తారు గానీ, మూడు కోట్లు పెట్టి ఎవరూ సినిమా తీయరని, అందుకే కృష్ణవంశీ రుణం తీర్చుకోలేనిదని తన మనసులోని భావాలను బయటపెడుతూ భావోద్వేగం చెందారు బ్రహ్మాజీ. ఈ కబుర్లతో కృష్ణవంశీ వ్యక్తిత్వం ఏమిటో కూడా సినీ ప్రేక్షకులకు తెలిసి వచ్చినట్లయ్యింది. నిజంగానే ఒక్క భోజనం విలువ ఒక జీవితాన్నే మార్చేసిందంటే… సాధారణ విషయం కాదు కదా..!



