తెలంగాణా అభివృద్ధిలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాత్ర ఎంత ఉందో… అతని కుమారుడు కేటీఆర్ కృషి కూడా అదే స్థాయిలో ఉందనే విధంగా తెలంగాణా పెట్టుబడుల విషయంలో కీలక భూమిక పోషిస్తున్న వైనం తెలిసిందే. ఐటీ శాఖ, పంచాయితీ రాజ్ శాఖ, మునిసిపల్ & అర్బన్ అభివృద్ధి శాఖలకు చెందిన మంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తున్న కేటీఆర్, దేశవిదేశాలలో పర్యటనలు చేస్తూ, తెలంగాణాలో పెట్టుబడులను ప్రోత్సహిస్తున్న వైనం, కేటీఆర్ కు ఎనలేని ఫాలోయింగ్ ని తెచ్చిపెట్టింది.
అంతేగాక, సోషల్ మీడియాలో కూడా ప్రజలకు ఎప్పుడూ టచ్ లో ఉండే కేటీఆర్ అంటే తెలంగాణాలోనే కాదు, ఏపీలో కూడా అభిమానగణం ఉందన్న విషయం గతంలో పలు సందర్భాలలోనే నిరూపణ అయ్యింది. తాజాగా మరోసారి కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా, భీమవరంలో కటౌట్ వెలిసింది. కేటీఆర్ మిత్ర బృందం పేరిట వెలిసిన ఈ కటౌట్ లో ‘తెలంగాణా మంత్రివర్యులు కల్వకుంట్ల తారక రామారావు గారికి జన్మదిన శుభాకాంక్షలు’ అని కేటీఆర్ ఫోటోతో కూడిన భారీ ఫ్లెక్సీ దర్శనమిచ్చింది.
గతంలో ఒక సమయంలో తానూ ఏపీ నుండి పోటీ చేయాల్సి వస్తే, ఉభయ గోదావరి జిల్లాలలో ఏదొక నియోజకవర్గం నుండి పోటీ చేస్తానని కేటీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత వివిధ సందర్భాలలో ఈ ఉభయ గోదావరి జిల్లాలలో వివిధ సందర్భాలలో కేటీఆర్ కటౌట్లు దర్శనమిస్తున్నాయి. మొత్తానికి తెలంగాణ ప్రజలనే కాక, ఏపీ ప్రజలకు కూడా కేటీఆర్ దగ్గరవుతున్న సూచనలు కనపడుతున్నాయి.



