
తెలంగాణ ఇంటిలెక్చువల్ ప్రాపర్టీ క్రైమ్ యూనిట్ (టీఐపీసీయూ)ను ప్రారంభించిన సందర్భంగా ప్రసంగించిన తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్… అమెరికాకు చెందిన ట్రేడ్ మార్క్స్ అండ్ పేటెంట్స్ ఆపీసు సంస్థ సహకారంతో టీఐపీసీయూను ఏర్పాటు చేశారని, ఈ ఏర్పాటులో ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, తెలుగు చిత్ర పరిశ్రమ, మోషన్ పిక్చర్ డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్ కీలక పాత్ర పోషించాయని అన్నారు.
ఇక, సినీ పరిశ్రమను పట్టి పీడిస్తున్న పైరసీపై స్పందించిన కేటీఆర్… సినిమా పైరసీ కారణంగా ప్రతి యేటా 1000 కోట్లకు పైగా నష్టపోతున్నామని తెలుసుకుని ఆశ్చర్యపోయానని… అందుకే సినిమా పైరసీని అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసారు. పైరసీ నియంత్రణలో బ్రిటన్ ప్రపంచంలోనే అత్యుత్తుమ విధానాన్ని అనుసరిస్తోందని, దీనిని స్ఫూర్తిగా తీసుకునే తెలంగాణలోనూ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ క్రైమ్ యూనిట్ ను ప్రారంభించాలని నిర్ణయించామన్నారు.
ఈ విధానం అమలు పరచనున్న తొలి రాష్ట్రం ఇండియాలో తెలంగాణా మాత్రమేనని గొప్పగా చెప్పారు. కాగా, కేటీఆర్ చేసిన ట్వీట్ కు సినీ వర్గాల నుండి విశేష స్పందన కూడా వచ్చింది. సినీ దర్శకుడు క్రిష్, హీరో రానా, ‘బాహుబలి’ నిర్మాత శోభు యార్లగడ్డ తదితరులు కేటీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు.



