ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో పారిశ్రామిక ప్రగతిలో ఎందుకు ఇంత వ్యత్యాసం ఉందో తెలుసుకొనేందుకు మరో తాజా ఉదాహరణగా తెలంగాణ ఐటి, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ బృందం తాజా విదేశీ పర్యటనలు చూస్తే అర్దమవుతుంది. భారత్తో సహా పలుదేశాల ఇంజనీర్లు, ఐటి నిపుణులు, ముఖ్యంగా కార్మికులు గల్ఫ్ దేశాలలో ఉద్యోగాలు చేస్తుంటారు.
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నుంచి కూడా లక్షల మంది గల్ఫ్ దేశాలకు వెళ్ళి అక్కడ పనిచేస్తున్నారు. కానీ కేటీఆర్ బృందం గల్ఫ్ దేశాల నుంచి కూడా తెలంగాణకు పెట్టుబడులు రాబట్టడం విశేషం. ప్రస్తుతం దుబాయ్లో పర్యటిస్తున్న ఆయన బృందం మంగళవారం ఒక్కరోజే సాధించిన పెట్టుబడులు, వివరాలు…
1. అగ్నిమాపక పరికరాలను తయారుచేసే నాఫ్కో: రూ.700 కోట్లు పెట్టుబడి. దీంతో అగ్నిమాపక పరికరాల తయారీ సంస్థ, ఫైర్ సేఫ్టీ ట్రైనింగ్ అకాడమీని ఏర్పాటు చేయబోతోంది.
2. యూఏఈలో ప్రముఖ పోర్ట్ ఆపరేటర్ డీపీ వరల్డ్: రూ.165 కోట్ల పెట్టుబడితో ఇన్ల్యాండ్ కంటెయినర్ డిపో ఆపరేషన్, మరో రూ.50 కోట్ల పెట్టుబడితో మేడ్చల్లో భారీ కోల్డ్ స్టోరేజ్ వేర్ హౌస్ను ఏర్పాటు చేయబోతోంది.
3. లులూ గ్రూప్: రూ.1,000 కోట్ల పెట్టుబడితో రాజన్న సిరిసిల్లా జిల్లాలో భారీ కోల్డ్ స్టోరేజ్, ఫిష్ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేయబోతోంది. (చంద్రబాబు నాయుడు తీసుకువచ్చిన ఈ సంస్థనే జగన్ ప్రభుత్వం విశాఖ నుంచి తరిమేసింది).
4. మలబార్ గ్రూప్: రూ.125 కోట్ల పెట్టుబడితో ఫర్నీచర్ తయారీ పరిశ్రమను ఏర్పాటుచేయబోతోంది. ఈ సంస్థ ఇదివరకే తెలంగాణలో భారీ పెట్టుబడి పెట్టింది. మళ్ళీ మరోసారి పెట్టుబడి పెట్టబోతోంది.
దుబాయ్లో కేటీఆర్ బృందం ఒకే ఒక్కరోజు పర్యటనలో ఈ నాలుగు కంపెనీల నుంచి తెలంగాణ రాష్ట్రానికి రూ.1,990 కోట్లు పెట్టుబడులు సంపాదించిపెట్టారు. ఈ నాలుగు కంపెనీల ద్వారా తెలంగాణలో సుమారు 2-3000 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు, పరోక్షంగా వేలాదిమందికి ఉపాధి లభిస్తుంది.
ఇప్పుడు ఏపీ విషయానికి వస్తే, ఐటి, పరిశ్రమల శాఖల మంత్రి గుడివాడ అమర్నాథ్ ఎప్పుడైనా మీడియా ముందుకు వచ్చినా లేదా సోషల్ మీడియాలోనైనా దేని గురించి మాట్లాడుతుంటారో అందరికీ తెలుసు. కనుక వాటి గురించి మళ్ళీ చెప్పుకోనవసరం లేదు. తెలంగాణ ఐటి, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ బృందం గత 9 ఏళ్లుగా పెట్టుబడుల కోసం దేశవిదేశాలు తిరిగితే ఇప్పటి వరకు సుమారు రూ.5-6 లక్షల కోట్లు మాత్రమే సాధించగలిగారు.
కానీ “పెట్టుబడుల కోసం మనం ఇతర దేశాల చుట్టూ తిరగక్కరలేదు… జగన్ ఇమేజ్ని చూసి దేశవిదేశీ సంస్థలే ఏపీలో రూ.16.56 లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టేశాయని, వాటితో ఏకంగా 6 లక్షల మందికి ఉద్యోగాలు లభించబోతున్నాయని” మంత్రి గుడివాడ అమర్నాథ్ చెపుతుంటారు. నమ్మి తీరాల్సిందే! కదా?



