తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి నెలరోజులు కూడా కాక మునుపే బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేటీఆర్, హరీష్ రావు ఇద్దరూ కాంగ్రెస్ హామీల గురించి ప్రస్తావిస్తూ చేస్తున్న తీవ్ర విమర్శలు, ఆరోపణలు అందరూ వింటూనే ఉన్నారు. అయితే కొత్త ప్రభుత్వం నిలదొక్కుకోవడానికి కనీసం 5-6 నెలల సమయం పడుతుందని తెలిసి ఉన్నా వారిద్దరూ నెల రోజులు గడవక మునుపే రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ఎందుకు యుద్ధం ప్రకటించేశారు? అని ఆలోచిస్తే నాలుగు కారణాలు కనిపిస్తున్నాయి.
1. శాసనసభ ఎన్నికలలో ఓడిపోయి అధికారం కోల్పోవడంతో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ముగ్గురూ తీవ్ర అసహనంతో ఉన్నారని కాంగ్రెస్ నేతలు చెపుతున్నారు.
2. ఓటమి కారణంగా పార్టీ శ్రేణులు తీవ్ర నిరాశ, నిస్పృహలతో ఉన్నాయి. కనుక రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎక్కువ రోజులు మనుగడ సాగించలేదని, అప్పుడు మళ్ళీ మనమే అధికారంలోకి వస్తామని పార్టీ శ్రేణులకు ధైర్యం చెప్పేందుకు కావచ్చు.
3. కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు అమలుచేయలేక ప్రజలను మభ్యపెడుతుందని ప్రజలను గట్టిగా నమ్మించగలిగితే త్వరలో జరుగబోయే లోక్సభ ఎన్నికలలో కాంగ్రెస్ని చావు దెబ్బ తీసి బిఆర్ఎస్ పార్టీ మరిన్ని సీట్లు గెలుచుకోవచ్చుననే ఆలోచన ఉండి ఉండవచ్చు.
4. లోక్సభ ఎన్నికలలో కూడా కాంగ్రెస్ చేతిలో బిఆర్ఎస్ మళ్ళీ దెబ్బ తింటే, పార్టీ శ్రేణులలో అధిష్టానంపై నమ్మకం కోల్పోయే ప్రమాదం ఉంటుంది. అప్పుడు కాంగ్రెస్తో పాటు బీజేపీ కూడా తమ ఎమ్మెల్యేలు, నేతలను ఎత్తుకుపోతే ఇన్నేళ్ళుగా కష్టపడి నిర్మించుకున్న బిఆర్ఎస్ పార్టీ కుప్పకూలిపోయే ప్రమాదం పొంచి ఉంది. అలాంటి ప్రమాదం జరుగక ముందే కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా నిలదొక్కుకోక మునుపే ఒత్తిడి పెంచేసి తప్పటడుగులు వేసేలా చేసి లోక్సభ ఎన్నికలలో ఎదురు దెబ్బ తీయాలనే ఆలోచన ఉండి ఉండవచ్చు.
అయితే ఆలోగా పార్టీ శ్రేణులు నీరుగారిపోకుండా కాపాడుకోవలసి ఉంటుంది. బహుశః అందుకే త్వరలో కేసీఆర్ మళ్ళీ ప్రజల మద్యకు వస్తున్నారు. అప్పుడు ఆయన రేవంత్ ప్రభుత్వానికి సినిమా చూపిస్తారంటూ కేటీఆర్, హరీష్ రావు ఇద్దరూ ఉత్సాహపరుస్తున్నట్లు భావించవచ్చు.




