మొన్న ఢిల్లీలో కేంద్రమంత్రి సీఆర్ పాటిల్ సమక్షంలో ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు, జలవనరుల మంత్రులు, కార్యదర్శులు సమావేశమైతే కృష్ణా, గోదావరి నీళ్ళని చంద్రబాబు నాయుడుకి అప్పగించి వచ్చేశారు… బనకచర్ల ప్రాజెక్టు కోసం కమిటీ వేస్తే రేవంత్ రెడ్డి సంతకం పెట్టేశారు.. రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలను మోసం చేశారంటూ బీఆర్ఎస్ పార్టీ నేతలు, తెలంగాణ జాగృతి కండువా కప్పుకొని తిరుగుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపణలు చేశారు.
ఢిల్లీలో కేంద్రమంత్రి సమక్షంలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశం అవడం ఏదో పెద్ద నేరమన్నట్లు మాట్లాడిన కేటీఆర్, ఇప్పుడు “నారా లోకేష్ నా తమ్ముడు లాంటివాడు. మా ఇద్దరికీ మంచి స్నేహం ఉంది. నారా లోకేష్ నాలాగే యువకుడు.. పైగా పొరుగు రాష్ట్ర మంత్రి. ఆయనని కలవలేదు కానీ కలిస్తే తప్పేమిటి?” అని ప్రశ్నించడం చూసి అందరూ నవ్వుకుంటున్నారు.
అయినా బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు అధికారంలో లేదు. కేటీఆర్కి మంత్రి పదవి లేదిప్పుడు. అటువంటప్పుడు తాము ఎంతగానో ద్వేషిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కుమారుడు నారా లోకేష్ని కలవాల్సిన అవసరం ఏమిటి? గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలలో మద్దతు కోసమా లేదా వచ్చే ఎన్నికలలో టీడీపీతో పొత్తు కోసమా లేదా బీజేపీలో విలీనంలో సాయం కోరేందుకా?
సొంత చెల్లి కల్వకుంట్ల కవితపై తీన్మార్ మల్లన్న అనుచిత వ్యాఖ్యలు చేస్తే స్పందించని కేటీఆర్, నారా లోకేష్ నా తమ్ముడు.. స్నేహితుడని చెప్పుకొని జగన్లాగే తన నాలికకి కూడా నరం లేదని కేటీఆర్ నిరూపించుకున్నారుగా?
ఒకవేళ కేటీఆర్ రహస్యంగా వచ్చి తనని కలిశారని మంత్రి నారా లోకేష్ చెపితే, ఎందుకు కలిశారో చెపితే కేటీఆర్ మొహం ఎక్కడ పెట్టుకుంటారు?




