అది అయ్య జాగీరైనప్పుడు జనసేనాని చూసి ఉలికిపాటు దేనికి?

KTR, Ponnam React to Pawan Kalyan’s Telangana Remarks

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌ “తెలంగాణ మీ అయ్య జాగీరా?’ అంటూ వేసిన ప్రశ్నకు కాంగ్రెస్‌ తరపున మంత్రి పొన్నం ప్రభాకర్‌, బీఆర్ఎస్‌ పార్టీ తరపున కేటీఆర్‌ “అవును ఇది మా అయ్య జాగీరే” అని సమాధానం చెప్పారు. ఇంకా టీఆర్ఎస్‌ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కూడా సమాధానం చెప్పాల్సి ఉంది. ఆమె కూడా “యస్! ఇది మా అయ్య జాగీరే” అని చెప్పవచ్చు.

కేటీఆర్‌ మాట్లాడుతూ, “తెలంగాణ రాష్ట్రాన్ని, ప్రజలని కాపాడుకోవడానికి మాకు కేసీఆర్‌ ఉన్నారు. తెలంగాణకు ఆయన ఒక్కరు చాలు,” అని అన్నారు. కానీ కాంగ్రెస్‌ పార్టీ కేసీఆర్‌ అవసరం లేదు. ఆయన పని ఎప్పుడో అయిపోయింది. మరో 5 ఏళ్ళు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుంటున్నారు. ఉంటారని కాంగ్రెస్‌ నేతలు చెపుతున్నారు.

ADVERTISEMENT

ఆ రెండు పార్టీల వలన తెలంగాణకు న్యాయం జరుగలేదు. సామాజిక తెలంగాణ సాధన కోసం నేను ముఖ్యమంత్రి అవడం చాలా అవసరం. నేను ముఖ్యమంత్రి అయితే ఓ అమ్మలాగ రాష్ట్ర ప్రజలను కడుపులో పెట్టుకొని చూసుకుంటాను,” అని కల్వకుంట్ల కవిత చెప్తున్నారు.

కనుక తెలంగాణలో ఉన్న ఈ మూడు పార్టీలే ఒకరి నాయకత్వం మరొకరికి అవసరం లేదని చెప్పుకుంటున్నప్పుడు, పవన్ కళ్యాణ్‌ నాయకత్వాన్ని ఎలా అంగీకరించగలవు? ముఖ్యంగా కేటీఆర్‌, కవిత ఇద్దరికీ ముఖ్యమంత్రి కావాలనే ఆశ, కోరిక ఉంది. కనుక అన్నా, చెల్లి ముఖ్యమంత్రి పదవికి పోటీ పడుతున్నప్పుడు పవన్ కళ్యాణ్‌ వస్తే రెడ్ కార్పెట్ వేసి వెల్‌కమ్‌ చెప్పరు కదా? కనుక అందరూ ‘ఇది మా అయ్యా జాగీరే’ దీనిపై మాకు మాత్రమే సర్వహక్కులు ఉన్నాయనుకుంటున్నారు.

తెలంగాణ తమ అయ్య జాగీరని భావిస్తున్నప్పుడు, ప్రజలు తమ వెంటే ఉన్నారని గట్టిగా నమ్ముతున్నప్పుడు కాంగ్రెస్‌, బీఆర్ఎస్‌, టీఆర్ఎస్‌ పార్టీలు జనసేనని ధైర్యంగా ఆహ్వానించి, ఎన్నికలలో తమతో పోటీ పది గెలిచి అధికారం దక్కించుకోమని సవాలు విసిరితే హుందాగా ఉండేది. కానీ ఇంత ఉలికిపాటు, ఆగ్రహం ఆవేశం దేనికి? ఆందోళనతోనే కదా?

కానీ ‘ఇది మా అయ్య జాగీరే’ అంటూ ప్రగల్భాలు పలకడం చాలా హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రాన్ని మా అయ్య జాగీరని చెప్పుకోవడం, దానిపై తమకు మాత్రమే వంశపారంపర్యంగా అధికార హక్కులు ఉంటాయనుకోవడం రాజరికపు పోకడే కదా? కానీ మనం ఉన్నది ప్రజాస్వామ్యవ్యవస్థలోనని పవన్ కళ్యాణ్‌ గుర్తు చేశారు కదా?

ADVERTISEMENT
Latest Stories