పదేళ్లపాటు తెలంగాణ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రిగా పాలిస్తూ, రాష్ట్ర రాజకీయాలను శాశించిన కేసీఆర్ జాతీయ రాజకీయాలలో కూడా చక్రం తిప్పాలనుకున్నారు. కేవలం 17 ఎంపీ సీట్లతోనే ఎలా చక్రం తిప్పగలరు?ప్రధాని ఎలా కాగలరు?అని ప్రశ్నించేవాళ్ళని ‘సన్నాసులని’ తీసి పడేసేవారు.
పదేళ్ళ పాలనలో కేసీఆర్ కూడబెట్టిన అవినీతి సొమ్ముని పెట్టుబడిగా పెట్టి ఇతర రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలను కొనుగోలు చేసి జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పాలనుకున్నారని కాంగ్రెస్, బీజేపీలు ఆరోపిస్తుండేవి. అయితే కేసీఆర్ జాతీయ రాజకీయాల ప్రయత్నించిన ప్రతీసారి ఎదురుదెబ్బలే తగులుతుండటం విశేషం.
2019 లోక్సభ ఎన్నికలలో బీజేపీకి మెజార్టీ రాదని, అప్పుడు తాను ఇతర పార్టీలను కూడగట్టుకుని చక్రం తిప్పాలని కేసీఆర్ ‘సారు… కారు… సర్కారు,” అంటూ చాలా హడావుడి చేశారు. కానీ మళ్ళీ బీజేపీ కేంద్రంలో పూర్తి మెజార్టీతో మళ్ళీ అధికారంలోకి వచ్చింది. దాంతో కేసీఆర్ కొంత కాలం సైలంట్ అయిపోయారు.
మళ్ళీ రెండోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ‘థర్డ్ ఫ్రంట్’ అంటూ ప్రత్యేక విమానం వేసుకుని దేశాటన చేస్తూ కేసీఆర్ చేసిన హడావుడి, మహారాష్ట్రలో చేసిన హడావుడి అందరూ చూశారు. కానీ ఈసారి సొంత రాష్ట్రంలోనే కేసీఆర్ ఓడిపోయి ఇంట్లో కూర్చోవలసి వచ్చింది. దీంతో ఇప్పుడు మహారాష్ట్రవైపు కన్నెత్తి కూడా చూడటం లేదు.
కేసీఆర్ జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పకపోయినా త్వరలో జరుగబోయే లోక్సభ ఎన్నికలలో తెలంగాణలోని 17 స్థానాలలో అత్యధిక స్థానాలు గెలుచుకోవడం అత్యవసరంగా మారింది. లేకుంటే కాంగ్రెస్ మంత్రులు హెచ్చరిస్తున్నట్లు ఎన్నికల తర్వాత బిఆర్ఎస్ పార్టీ చెల్లాచెదురయ్యే ప్రమాదం ఉంది.
బహుశః అందుకేనేమో ఆయన కుమారుడు, ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మళ్ళీ జాతీయ రాజకీయాలు, కాంగ్రెస్, ఇండియా కూటమి అంటూ ట్విట్టర్లో పెద్ద పోస్ట్ పెట్టి, కాంగ్రెస్ పని అయిపోయింది.
ఇదివరకు దేశ ప్రజలు కేసీఆర్ ఒక్కరి వైపే చూసేవారని బిఆర్ఎస్ నేతలు చెప్పుకునేవారు. కానీ ఇప్పుడు బీజేపీని ఎదుర్కోగల మొనగాళ్ళు కేసీఆర్, అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ మాన్, మమతా బెనర్జీలే అని, కనుక దేశ ప్రజలు తమవైపే చూస్తున్నారని కేటీఆర్ కనిపెట్టి చెప్పారు.
ప్రధాని నరేంద్రమోడీ, బీజేపీలపై కత్తులు దూస్తున్నట్లు నటిస్తూనే, ఢిల్లీ లిక్కర్ స్కామ్లో చిక్కుకున్న కూతురు కల్వకుంట్ల కవితని కాపాడుకునేందుకు మళ్ళీ వారితోనే లోపాయికారి ఒప్పందాలు చేసుకుంటూ రాజకీయాలు చేస్తున్న కేసీఆర్ని, బీజేపీని ఎదుర్కొనే మొనగాడని కేటీఆర్ చెప్పుకోవడం చాలా హాస్యస్పదంగా ఉంది కదా?
అయితే బిఆర్ఎస్ మొదలుపెట్టిన ఈ కొత్త డ్రామా మోడీని, బీజేపీలని ఎదుర్కొనేందుకు మాత్రం కానేకాదు. తెలంగాణ ప్రజలను మళ్ళీ మభ్యపెట్టి, 17 ఎంపీ సీట్లలో అత్యధిక సీట్లు గెలుచుకొనేందుకే! ఈ విషయం లోక్సభ ఎన్నికలలోగా లేదా ఆ తర్వాత తప్పకుండా బయటపడుతుంది.
మోసం కాంగ్రెస్ నైజం
నయవంచనకు నిలువెత్తు రూపం.. కాంగ్రెస్
అందుకే ఆదిలోనే ఇండియా కూటమికి బీటలుఅందుకే కాంగ్రెస్ ను వీడి
టీఎంసీ, ఆమ్ ఆద్మీ పార్టీల
ఒంటరి పోరు…
మిత్రపక్షాలను ఒప్పించలేని కాంగ్రెస్
దేశ ప్రజలను ఏం మెప్పిస్తుంది.మోదీని, బిజెపిని ఎదుర్కొనే సత్తా కాంగ్రెస్ కు లేదు…
— KTR (@KTRBRS) January 25, 2024




