గతంలో చంద్రబాబు అధికారంలో ఉండగా వైసీపీ నేతలు ‘చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో అప్పటి ఉప ముఖ్యమంత్రి కె ఈ కృష్ణమూర్తిని చంద్రబాబు అవమానించారు. అప్పటి హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్పను అవమానించారు అంటూ విమర్శలు చేసిన ఉదంతాలు ఎన్నో. తాజాగా ఇప్పుడు జగన్ హయాంలో వ్యవసాయమంత్రి కురసాల కన్నబాబుకి అన్యాయం జరిగినట్టుగా కనిపిస్తుంది.
వివరాల్లోకి వెళ్తే… ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఈరోజు నెల్లూరు లో వైఎస్సార్ రైతు భరోసా పథకాన్ని ప్రారంభిస్తున్నారు. దీనిలో భాగంగా పత్రికల్లో ఫుల్ పేజీ ప్రకటనలు ఇచ్చారు. ఏపీలోనే కాదు..సాక్షితో పాటు మరికొన్ని ఆంగ్ల పత్రికల్లో హైదరాబాద్ లోనూ యాడ్స్ వేశారు. వ్యవసాయ శాఖ ఇచ్చిన ఈ ప్రకటనలలో కనీసం వ్యవసాయ మంత్రి స్టాంప్ సైజు ఫోటో కూడా లేకపోవడం విశేషం.
అత్యంత ప్రతిష్టాత్మక కార్యక్రమం చేపట్టిన యాడ్స్ లో ముఖ్యమంత్రితో సంబంధిత శాఖ మంత్రి ఫోటోలు వేయటం ఆనవాయితీ. ఏ ప్రభుత్వంలో అయినా అలాగే చేస్తారు. చంద్రబాబు హయాంలో కూడా ప్రకటనల్లో సంబంధిత శాఖల మంత్రుల ఫోటోలు వచ్చేవి. అయితే ఇప్పుడు ఆ ఆనవాయితీకి జగన్ స్వస్తి చెప్పినట్టుగా కనిపిస్తుంది.
యాడ్ చివర్లో మంత్రి పేరు రాసి వదిలేశారు. వ్యవసాయ శాఖ పేరుతో విడుదల చేసిన ఫుల్ పేజీ ప్రకటనలో ఇయర్ ప్యానల్ లో కూడా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఫోటోనే పెట్టారు కానీ..ఆ శాఖ మంత్రిని ప్రకటన విడుదల చేసిన శాఖ ఎలా విస్మరించింది?. ఇది ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు జరిగిందా? లేక వ్యవసాయ శాఖ అధికారులు అత్యుత్సాహమా?.



