అవును ఒక్కడి వ్యసనం, ఒక్కడి నిర్లక్ష్యం కొన్ని కుటుంబాలలో ఆరని శోకానికి కారణమయ్యింది. అలాగే ఎందరో జీవితాలలో తీరని బాధను మిగిల్చింది. కర్నూల్ బస్సు విషాదం వెనుక ఆ ఒక్కడి నిర్లక్షమే 20 మంది ప్రాణాలు తీసింది, ఆ ఒక్కడి వ్యసనమే 20 కుటుంబాలలో తీరని ఆవేదనను తెచ్చిపెట్టింది.
ఒక ప్రయివేట్ ట్రావెల్స్ బస్సు కి బైక్ ఢీ కొని ఆ బస్సులో ప్రయాణం చేస్తున్న 20 మంది అగ్నికి ఆహుతైన చేదు ఘటన కర్నూలో చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఇంతటి అగ్ని ప్రమాదానికి కారణమైన బైకర్ శివ శంకర్ కు సంబంధించిన సీసీ టీవీ ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ప్రమాద స్థలానికి సమీపంలో రాత్రి 2.20 నిముషాలకు శివ, మరో వ్యక్తితో ఒక పెట్రోల్ బంక్ లో కనిపించాడు. అయితే అక్కడ నమోదైన ఫుటేజ్ ఆధారంగా ఆ సమయంలో శివ బైక్ నడిపిన తీరు చూస్తుంటే ఆయన ఫుల్ గా మద్యం సేవించి ఉన్నాడనేది స్పష్టమవుతుంది.
పెట్రోల్ బంక్ లో శివ బైక్ డ్రైవ్ చాల రాష్ గా కనిపించింది. అలా జరిగిన కొద్దీ సేపటికి శివ తన బైక్ తో ఈ ట్రావెల్ బస్సును ఢీ కొట్టాడు. దానితో అతి వేగంగా బస్సును చుట్టుముట్టిన మంటలు 20 మందిని సజీవ దహనం చేసాయి. ఈ ఘటన యావత్ దేశాన్నే ఉలిక్కిపడేలా చేసింది.
తల్లి కోసం పిల్లలు, తమ బిడ్డ ఎక్కడ అంటూ కన్న వారు రక్త కన్నీరు కారుస్తున్నారు. ఈ ప్రమాదంలో ఒక నిండు కుటుంబం దహనమయిపోయిన దృశ్యాలు చుస్తున్నాం. ఆ హృదయ విదారక దృశ్యాలు చూస్తున్న ప్రతి ఒక్కరు ఇటువంటి పరిస్థితి మరే కుటుంబానికి రాకూడదు అంటూ దైవాన్ని మొక్కుతున్నారు.
అయితే ఇందులో తప్పెవరిది.? శిక్ష ఎవరికీ.? అంటే తప్పు నిర్లక్ష్యానిది, వ్యసనానిది అయితే శిక్ష మాత్రం అన్యంపుణ్యం ఎరుగని అమాయకులది, వారి కుటుంబాలది. ఇటువంటి చేదు ఘటనలు చూసినప్పుడే అనిపిస్తుంది ఒక నిండు ప్రాణం ఖరీదు ఒక మద్యం బాటిలా అని.







