నేడు కూడా… జాతీయస్పూర్తి కనిపించదే!

Lack of National Spirit on Independence Day

నేడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకున్నాయి. ఈ సందర్భంగా అందరూ స్వాతంత్ర్య సమర వీరులను స్మరించుకొని వారికి నివాళులు అర్పించారు. వారి త్యాగాల ఫలమే నేడు మనం అందరం అనుభవిస్తున్న స్వేచ్చా, స్వాతంత్ర్యాలని అందరూ ముక్త కంఠంతో చెప్పారు.

ఈవిదంగా వారి త్యాగఫలం అనుభవిస్తున్నప్పుడు దానిని అందరూ గౌరవిస్తున్నారా?జాతీయస్ఫూర్తి కలిగి ఉన్నారా? అంటే కాదనే చెప్పవచ్చు.

ADVERTISEMENT

ఈరోజు స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో కూడా ఇరుగు పొరుగు రాష్ట్రాలతో సఖ్యతగా ఉండాలనే మాట ఎవరి నోట వినిపించడం లేదు.

ఈ విషయంలో కూడా ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు అందరికీ ఆదర్శప్రాయంగా నిలుస్తున్నారు. ఎగువన తెలంగాణ అవసరాలకు తగ్గట్లు సాగునీటి ప్రాజెక్టులు నిర్మించుకోమని, వాటికి తమ ప్రభుత్వం అడ్డు పడబోదని చాలా స్పష్టంగా చెపుతున్నారు.

తెలంగాణ వాడుకోగా కూడా ఇంకా లక్షల క్యూసెక్కుల నీళ్ళు వృధాగా సముద్రంలో కలిసిపోతున్నాయని, ఆ వరద నీటిని రాయలసీమకు వాడుకుంటే అడ్డుకోవద్దని తెలంగాణ ప్రభుత్వానికి, దీనిపై రాజకీయాలు చేస్తున్న బీఆర్ఎస్‌ పార్టీకి విజ్ఞప్తి చేశారు.

కానీ నేడు గోల్కొండ కోట వద్ద జరిగిన స్వాతంత్ర్య దినోత్సవంలో తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కృష్ణా, గోదావరి జలాల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని, బనకచర్ల ప్రాజెక్టుని అడ్డుకుంటామని చెప్పారు.

అలాగే దేశంలో బీజేపియేతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలు కూడా కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతోందని విమర్శిస్తున్నాయి.

తమిళనాడు పాలకులు హిందీ వివాదం గురించి, మరో రాష్ట్రం మరో విషయం ప్రస్తావిస్తూ అటు పొరుగు రాష్ట్రంపై లేదా కేంద్ర ప్రభుత్వంపై కత్తులు దూస్తూనే ఉన్నాయి.

ఇక రాజకీయ పార్టీలైతే చెప్పక్కరలేదు. ఏదో అంశం లేదా ఏదో పేరుతో ఇతర పార్టీలని నిందిస్తూనే ఉంటాయి. పరస్పరం బురద జల్లుకుంటూనే ఉంటాయి. ఏపీలో వైసీపీ అధినేత జగన్‌ ప్రేలాపనలే ఇందుకు చక్కటి నిదర్శనం.

తెలంగాణలో బీఆర్ఎస్‌ పార్టీ సొంత మీడియా ‘నమస్తే తెలంగాణ’ ఈరోజు (ఆగస్ట్ 15) ఆన్‌లైన్‌ సంచికలో “కేంద్రం పగ… బాబు దగా!..మనకు దక్కాల్సిన సెమీ కండక్టర్ పరిశ్రమ ఏపీకి తరలింపు,” అంటూ ఓ కధనం ప్రచురించింది.

కేసీఆర్‌ తన పార్టీ పేరులో తెలంగాణని తొలగించి భారత్‌గా మార్చుకున్నప్పటికీ, ఆయనలో నేటికీ ప్రాంతీయవాదమే తప్ప జాతీయస్పూర్తి లేదనిపిస్తుంది.

నాడు జగన్‌ మూడు రాజధానులు అంటూ డ్రామాలు ఆడుతూ కాలక్షేపం చేస్తుంటే, తెలంగాణ ప్రభుత్వం తెలివిగా ఈ అవకాశాన్ని వినియోగించుకొని భారీగా పరిశ్రమలు, పెట్టుబడులు సంపాదించుకుంది. అప్పుడు ఏపీ ప్రజలు ఇది మా దౌర్భాగ్యమని బాధ పడ్డారే తప్ప తెలంగాణని ఎవరూ తప్పు పట్టలేదు.

కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏపీకి ఓ సెమీ కండక్టర్ పరిశ్రమని మంజూరు చేస్తే బీఆర్ఎస్‌ పార్టీ అసూయతో రగిలిపోతోంది. కనీసం స్వాతంత్ర్య దినోత్సవం నాడు కూడా ఎవరిలో ‘జాతీయస్పూర్తి’ కనిపించకపోవడం చాలా బాధాకరమే కదా?

ADVERTISEMENT
Latest Stories