ఎన్టీఆర్ భార్య హోదాతో రాజకీయాలలో తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకొని, రాజకీయాలలో చురుకుగా పాల్గొనకపోయిన తన ఉనికిని కాపాడుకోగలుగుతున్న ఏకైక వ్యక్తి లక్ష్మీ పార్వతి మాత్రమే.
ఓ ప్రముఖ తెలుగు న్యూస్ చానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మళ్ళీ చంద్రబాబు నాయుడు, దగ్గుబాటి వేంకటేశ్వర రావు ఇద్దరూ ఎన్టీఆర్కి వెన్నుపోటు పొడిచారని చెపుతూ, నాడు టీడీపీలో ఆవిదంగా అధికార మార్పిడి ఎందుకు జరిగిందో చెప్పారు.
ఆ ప్రయత్నంలో ఆమె దానికంతటికి కారణం తాను ఎన్టీఆర్ని చెప్పు చేతలలో పెట్టుకోవడమే అని చెప్పేశారు. “ఎన్టీఆర్గారు నా చెప్పు చేతలలో ఉండేవారు. కనుక మంత్రి పదవి తీసుకోవాలంటే అదేం పెద్ద కష్టం కాదు నాకు. నాకు ఎన్టీఆర్ పార్టీలో కీలక పదవి అప్పగించారు. రెండుసార్లు మంత్రి పదవి కూడా ఇస్తామన్నారు. కావాలంటే మోహన్ బాబుని అడగండి. చెపుతారు. ఎన్టీఆర్ నా చెప్పు చేతలలో ఉన్నారనే అసూయ, ద్వేషంతోనే అందరూ కలసి కుట్ర చేశారు,” అని లక్ష్మీ పార్వతి అన్నారు.
టీడీపీలో నందమూరి బాలకృష్ణ, హరికృష్ణ, చంద్రబాబు నాయుడు, దగ్గుబాటి వేంకటేశ్వర రావు తదితరులు అందరూ ఉండగా, ఆమె మొదట ఎన్టీఆర్ జీవితంలోకి చాప కింద నీరులా ప్రవేశించి తర్వాత పార్టీని, ప్రభుత్వాన్ని నడిపిస్తున్న ఎన్టీఆర్ని తన చెప్పు చేతలలోకి తెచ్చుకోవాలని ప్రయత్నించారు. తాజా ఇంటర్వ్యూలో కూడా ఎన్టీఆర్ తన చెప్పు చేతలలో ఉండేవారని ఆమె స్వయంగా చెప్పుకున్నారు కదా?
కనుక ఆమె బారి నుంచి టీడీపీని, దానిపై ఆధారపడి ఉన్న వేలాదిమంది నేతలను, లక్షలాది మంది కార్యకర్తలని కాపాడుకోవాలనే నాడు చంద్రబాబు నాయుడు అంత సాహసానికి పూనుకోవలసి వచ్చిందని ఆమె మాటలతోనే స్పష్టమవుతోంది.
ఒకవేళ ఆమె ఓ గృహిణిగా ఇంటికే పరిమితమై ఉండిపోయినా లేదా తాను ఎన్టీఆర్ భార్యననే అహం పక్కన పెట్టి పార్టీలో అందరితో కలిసిపోయి పనిచేసినా నేడు ఆమే కూడా వైసీపీలో కాకుండా టీడీపీలో కీలక పదవిలో ఉండేవారు కదా?
కానీ ఎన్టీఆర్ ద్వారా సంక్రమించిన అధికారం లేదా హక్కుతో ఆమె ప్రభుత్వాన్ని, పార్టీని తన చేతుల్లోకి తీసుకోవాలని ప్రయత్నించినందునే నేడు ఆమె బయటా, నందమూరి కుటుంబ సభ్యులందరూ చంద్రబాబు నాయుడు వెంట టీడీపీలో ఉన్నారు. ప్రజలు కూడా చంద్రబాబు నాయుడునే ఆదరిస్తున్నారు తప్ప ఆమెను కాదు. ఎందుకు?




