తక్షణ తలాక్ నేరమంటూ లోక్సభ బిల్లును ఆమోదించింది. ట్రిపుల్ తలాక్ చట్టవిరుద్ధమని, ఇందుకు పాల్పడే భర్తలకు మూడేళ్లు జైలుశిక్ష పడుతుంటూ రూపొందించిన బిల్లుకు లోక్సభ ఆమోద ముద్ర వేసింది. కాంగ్రెస్ సహా పలు విపక్ష పార్టీలు కొన్ని సవరణలు సూచించినప్పటికీ బిల్లుకు అనుకూలంగా ఓటేశారు.
ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ తీవ్రంగా వ్యతిరేకించారు. ముస్లింల ప్రాథమిక హక్కులను ఈ బిల్లు కాలరాస్తోందని ఆరోపించారు. ఒవైసీకి ఒకరకంగా కేవలం తెరాస నుండి మాత్రమే మద్దత్తు లభించింది. ముస్లింలు నోచుకుంటారేమో అనే సంశయంతో తెరాస ఈ బిల్లు సమయంలో తమ ఎంపీలు లోక్ సభలో లేకుండా జాగ్రత్త పడింది.
ఆ విధంగా ముస్లిం మహిళల సాధికారతకు చిహ్నంగా భావిస్తున్న ఈ బిల్లుని పరోక్షంగా వ్యతిరేకించింది. లోక్సభలో గురువారం ఆమోదం పొందిన ఈ బిల్లు వచ్చేవారంలో రాజ్యసభ ముందుకు రానుంది. రాజ్యసభ కూడా ఆమోదించిన తర్వాత రాష్ట్రపతి ఆమోదానికి పంపుతారు. ఆయన ఆమోదముద్ర వేయగానే బిల్లు చట్టరూపం సంతరించుకుంటుంది.



