వైసీపీ హయాంలో హద్దులుదాటిన కొంతమంది వైసీపీ నేతల రాజకీయ విమర్శల పట్ల ప్రత్యర్థి పార్టీ నాయకుల నుంచి సామాన్య కార్యకర్త వరకు అలాగే రాజకీయాలకు సంబంధం లేని సాధారణ ఓటర్ నుంచి ఓటు హక్కు కూడా లేని పౌరుడి వరకు అందరు విసిగిపోయారు.
నాటి వారి పైశాచికానందానికి తగిన మూల్యం చెల్లించాల్సిందే అనే గట్టి అభిప్రాయం సర్వత్రా బలపడింది. అయితే పార్టీ శ్రేణుల భావోద్వేగాలతో రాజకీయ చదరంగం ఆడిన ఆ వైసీపీ నాయకులలో ప్రముఖంగా టీడీపీ కి కొడాలి నాని, వల్లభనేని వంశీ కాగా జనసేనకు పేర్ని నాని, ద్వారం పూడి చంద్రశేఖర్ ముఖ్యులు.
అయితే ఇక్కడ ప్రధానంగా ప్రస్తావించాల్సిన వారిలో ముందు వరుసలో ఉంటారు కొడాలి. గత వైసీపీ ప్రభుత్వం హయాంలో టీడీపీ నాయకుల పట్ల ముఖ్యంగా చంద్రబాబు, లోకేష్ పై నాని వాడిన భాష సభ్యసమాజానికి అత్యంత ప్రమాదకరం అనే చెప్పాలి.
కనీసం బాబు వయస్సుకి, అనుభవానికి కూడా గౌరవం ఇవ్వకుండా అమర్యాదగా, అసభ్యకరంగా కొడాలి వాడిన పదజాలం ప్రతి టీడీపీ కార్యకర్త గుండెను చెమ్మగిల్లేలా చేసింది, అలాగే ప్రతి సామాన్యుడిని విస్మయానికి గురి చేసింది.
అయితే నాడు కొడాలి పెట్రిగిపోతున్న విధానానికి కడుపు మండిన నారా లోకేష్ మా ప్రభుత్వం హయాంలో కొడాలి చర్యలకు తగిన ప్రతి చర్య ఉంటుందంటూ పేర్కొన్నారు.
పార్టీ కార్యకర్తలకు భరోసా అందించేందుకు గాను నాడు ఏపీ రాజకీయాలలోకి లోకేష్ ప్రవేశ పెట్టిన రెడ్ బుక్ లో కొడాలి పేరును నమోదు చేసినట్టు ప్రకటించారు.
కొడాలి బాధ్యత నాది…ఆయన నారా కుటుంబం పై చేసిన రాజకీయంతో మానసికంగా కుంగిపోయిన ప్రతి టీడీపీ కార్యకర్త మనోవేదనకు న్యాయం చేసే బాధ్యత నాది…మమ్మల్ని గెలిపించే కర్తవ్యం మీది అంటూ నాడు నారా లోకేష్ టీడీపీ శ్రేణులకు హామీ ఇచ్చారు.
అలాగే మరో వైసీపీ నేత ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఈయన ద్వారా జనసేన అధినేత పవన్ ను టార్గెట్ చేయించింది వైసీపీ. 2019 వైసీపీ విజయం తరువాత గోదావరి జిలాల్లో ద్వారంపూడి అరాచకం కట్టలు తెంచుకుంది.
పవన్ కళ్యాణ్ ఓటమిని ప్రస్తావిస్తూ పవన్ పై బూతుల తో రెచ్చిపోయారు, అలాగే జనసేన కార్యకర్తల పై రాలాల్తో కర్రలతో దాడి చేసి ఆ పార్టీ మహిళా నేతలను సైతం బూతులతో తిట్టిపోశారు.
ద్వారం పూడి అరాచకంలో జనసేన ముఖ్య నేత, పవన్ కు సన్నిహితుడు అయిన సందీప్ పంచకర్ల, ఘంటా స్వరూప పై ద్వారంపూడి వర్గం సామజిక దాడి చేసింది. నాటి వైసీపీ దాడులలో రక్తం చెమర్చిన జనసేన క్యాడర్ ద్వారం పూడి పై పగతో రగిలిపోయారు.
అయితే ద్వారంపూడి చర్యల పై మండిపడ్డ పవన్ జనసేన అధికారంలోకి వస్తే నాడు జనసేన నాయకులకు, మహిళా నేతలకు జరిగిన అవమానాలకు బదులు చెప్పి తీరుతాం, ద్వారం పూడి అవినీతి ద్వారాలు తెరుద్దాం అంటూ పార్టీ క్యాడర్ కు హామీ ఇచ్చారు పవన్.
అలాగే కూటమి ప్రభుత్వ హయాంలో కాకినాడ పోర్టులో ద్వారంపూడికి సంబంధించిన అక్రమ రేషన్ బియ్యం తరలింపు పై స్పందించిన పవన్ సీజ్ ది షిప్ అంటూ నడి సముద్రంలో ప్రకటన చేసారు. అయితే నాడు పవన్ ఇచ్చిన హామీ కానీ నేడు పవన్ ప్రకటించిన చర్యలు కానీ ఏవి జనసేన అధికారంలో ఉండి కూడా నెరవేర్చుకోలేకపోతుంది.
ఇలా ఇక్కడ టీడీపీ క్యాడర్ మనోభావాలతో రాజకీయం ఆడిన కొడాలి నాని లోకేష్ రెడ్ బుక్ కు చిక్కకుండా అనారోగ్య సమస్యల పేరుతో తప్పించుకుంటూ ఏపీ సరిహద్దులు దాటేసారు.
ఇక అక్కడ జనసైనుకుల భావోద్వేగాలతో పాలిటిక్స్ చేసిన ద్వారం పూడి మౌన వ్రతాన్ని పాటిస్తూ పవన్ కంట్లో పడకుండా జాగ్రత్తలు పాటిస్తున్నారు.
మరి అటు నారా లోకేష్ ఇటు పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా తమ పార్టీ శ్రేణుల మానవోదనకు, మానసిక క్షోభకు తమ చర్యలతో బదులు చెప్పగలరా.? పార్టీ క్యాడర్ కు ఇచ్చిన మాట నిలబెట్టుకోగలగరా.?




