సూపర్ స్టార్ రజనీకాంత్ అల్లుడు, ప్రముఖ హీరో అయిన ధనుష్ ను వివాదాలు వెన్నాడుతున్నాయి. ‘సుచీ లీక్స్’తో సుచిత్ర, ఆ వివాదం సర్దుమణిగింది అన్న తరుణంలో తల్లిదండ్రుల వివాదం… ఇలా వివాదాలు ధనుష్ ను నీడలా వెంటాడుతున్నాయి. తాజాగా ధనుష్ పై అతని తల్లిదండ్రులుగా చెబుతున్న మధురై వేలూరుకు చెందిన కదిరేశన్ – మీనాక్షి దంపతులు మధురై కోర్టులో మరో పిటిషన్ దాఖలు చేశారు.
ధనుష్ తమ కొడుకేనంటూ తొలుత పుట్టుమచ్చలను సాక్ష్యంగా చూపుతూ ట్విస్ట్ ఇచ్చారు. ఈ క్రమంలో ధనుష్ ఒంటిపై పుట్టుమచ్చలను లేజర్ చికిత్స ద్వారా చెరిపివేశారని, ఇందుకు కొన్ని ఆధారాలను ప్రభుత్వ వైద్యులు కోర్టుకు నివేదించిన సంగతి తెలిసిందే. అలాగే ధనుష్ దాఖలు చేసిన రిట్ పిటిషన్ లో అతని సంతకం నకిలీదని పేర్కొంటూ కదిరేశన్ దంపతులు తాజాగా కేసు వేశారు.
అంతే కాకుండా అతని సంతకం నకలును తమకు అందజేయాలని వారు కోర్టును కోరారు. దీంతో ధనుష్ షాక్ తిన్నట్టే కనపడుతోంది. ఇప్పటికే పుట్టుమచ్చలకు సంబంధించిన కేసు ఏప్రిల్ 11న విచారణకు రానుండగా, ఇది కూడా అతనిని ఇబ్బంది పెట్టేదేనని కదిరేశన్ దంపతుల న్యాయవాది చెబుతున్నారు. కాలం కలిసి రాకపోతే చీమ కాటుకు కూడా ప్రాణహాని తప్పదంటే ఇదేనేమో అన్నట్లుంది ధనుష్ పరిస్థితి!



