ఏపీ సిఎం జగన్మోహన్ రెడ్డికు బంధువు కూడా అయిన ఒంగోలు సిట్టింగ్ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డి కంట్లో నలుసులా మారడం విశేషం. ఒంగోలు ఎంపీ సీటుపై కన్నేసిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రయత్నిస్తుండటంతో, ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డికి అండగా ఎమ్మెల్యే బాలినేని నిలబడుతున్నారు.
ఒకవేళ మాగుంట శ్రీనివాసులు రెడ్డి లేదా ఆయన కుమారుడు రాఘవ రెడ్డికి ఒంగోలు ఎంపీ టికెట్ ఇవ్వదలచుకోకపోతే, ఆ టికెట్ తన కొడుకు ప్రణీత్ రెడ్డికి ఇవ్వాలని బాలినేని శ్రీనివాస్ రెడ్డి పట్టుబడుతున్నారు. అలాగే తాను మళ్ళీ ఒంగోలు నుంచే శాసనసభకు పోటీ చేస్తానని, నియోజకవర్గం మారిస్తే అంగీకరించబోనని చెపుతున్నారు.
మంగళవారం బాలినేని తన అనుచరులతో కలిసి విజయవాడలో వైసీపి నేతలందరూ దిగే హోటల్లో కాకుండా బందర్ రోడ్డులో గల వేరే హోటల్లో దిగారు. జగన్ తరపున సజ్జల రామకృష్ణా రెడ్డి రాయబారానికి వచ్చి బాలినేనితో సుమారు గంటసేపు చర్చించారు.
ఒంగోలు ఎంపీ టికెట్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికే ఇవ్వాలని జగన్ నిర్ణయం చెప్పగా బాలినేని తీవ్ర అభ్యంతరం చెప్పారు. తనకు పార్టీలో సముచిత గౌరవం, ప్రాధాన్యం ఇస్తున్నామని చెపుతూనే ఈవిదంగా అవమానించడం తగదని, ఈ అవమానాలు భరిస్తూ పార్టీలో ఉండలేనని బాలినేని ఖరాఖండీగా సజ్జలకు తేల్చి చెప్పేశారు.
ఒంగోలు, ఎంపీ, ఎమ్మెల్యే సీట్ల విషయంలో జగన్ నిర్ణయాలు తనకు ఆమోదం కావని, ఎంపీ మాగుంట కోసం, తన ఆత్మగౌరవం కోసం పార్టీని వీడేందుకు సిద్దంగా ఉన్నానని బాలినేని చెప్పేశారు.
ఆయన మొదట టిడిపిలో చేరాలనుకున్నారు. కానీ ఇప్పుడు వైఎస్ షర్మిల రాకతో ఏపీ కాంగ్రెస్ తలుపులు కూడా తెరుచుకున్నాయి. ఆమె కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసేందుకు బలమైన అభ్యర్ధుల కోసం వెతుకుతున్నారు.
ఒంగోలు వైసీపిలో నెలకొన్న ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తున్న వైఎస్ షర్మిల మూడు రోజుల క్రితమే కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం పేరుతో ఒంగోలుకు వెళ్ళారు. అప్పుడే ఆమె బాలినేనితో మాట్లాడిన్నట్లు తెలుస్తోంది.
కనుక వైసీపిలో బాలినేని శ్రీనివాస్ రెడ్డి, మాగుంట శ్రీనివాసులు రెడ్డిల అధ్యాయం ఇక ముగిసిన్నట్లే భావించవచ్చు. బహుశః నేడో రేపో ఇటు వీరిద్దరూ, అటు వైసీపి కూడా తమ నిర్ణయాలను ప్రకటించే అవకాశం ఉంది. ప్రకాశం జిల్లాపై మంచి పట్టున్న వారిద్దరూ కాంగ్రెస్ పార్టీలో చేరితే వైసీపికి పెద్ద ఎదురుదెబ్బే అవుతుంది.




