మహారాష్ట్ర లో ఖాళీ అయిన ‘కేసీఆర్ కారు’, మరి ఏపీలో..?

Brs Party

అధికారం ఉంది కదా అనే అహంతో ఇక మన రాష్ట్రంలోనే కాదు పక్క రాష్ట్ర రాజకీయాల్లో కూడా మనమే చక్రం తిప్పేయాలి, పక్క రాష్ట్ర రాజకీయ పార్టీలను కట్టడి చేసేయాలి అని కలలు కన్నా కేసీఆర్ కు ఓటమి తాలూకా అవమానాలు ఒక్కొక్కటిగా పలకరిస్తున్నాయి.

ADVERTISEMENT

తెరాస గా ఉన్న ప్రాంతీయ పార్టీని బిఆర్ఎస్ గా మార్చి జాతీయ స్థాయి రాజకీయాలలో కారు హవా చూపించాలి అని ఆశపడిన కేసీఆర్ కు కాంగ్రెస్ పార్టీ రిటర్న్ గిఫ్ట్ ఇచ్చింది. ఇక అధికారంలో ఉన్నప్పుడు పక్క పార్టీ నేతలను కేసీఆర్ ఎలా ఆకట్టుకున్నారో ఇప్పుడు అధికారం కోల్పోయిన తరువాత సొంత పార్టీ నేతలను అలానే పోగుట్టుకుంటున్నారు. “ఇదేనా కర్మ ఫలం” అంటే అని కౌంటర్లు వేస్తున్నారు అధికార పార్టీ నేతలు.

ఇప్పటికే బిఆర్ఎస్ పార్టీ తరుపున గెలిచిన కార్పొరేటర్లు, గ్రామస్థాయి నేతలు, ఎమ్మెల్యే స్థాయి నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో చేతులు కలపడానికి సిద్ధమయ్యారు. తెలంగాణలో అధికారాన్ని నిలుపుకోలేక పోయిన బిఆర్ఎస్ పార్టీ నేతలు అధికారాన్ని అందిపుచ్చుకున్న కాంగ్రెస్ పార్టీని త్వరలోనే గద్దెదింపుతాం అంటూ చేస్తున్న వ్యాఖ్యలు వారి రాజకీయ విలువలకు అద్దం పడుతున్నాయి.

అనుకున్న విధంగానే తెలంగాణలో అధికారాన్ని అందిపుచ్చుకుంటే పొరుగు రాష్ట్రమైన మహారాష్ట్రలో కూడా అడుగుపెట్టి బిఆర్ఎస్ పేరుకి న్యాయం చేయాలనుకున్న కేసీఆర్ కు మహారాష్ట్ర లోని బిఆర్ఎస్ నాయకులు కూడా ఊహించని రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు. పొరుగు రాష్ట్రాలైన ఏపీ, మహారాష్ట్రలలో బిఆర్ఎస్ పార్టీ తరుపున వేసిన తాత్కాలిక టెంటులను ఒక్కొక్కటిగా తొలగిస్తున్నారు స్థానిక బిఆర్ఎస్ నాయకులు.

ఇప్పటికే బిఆర్ఎస్ కండువా కప్పుకున్న పలువురు మహారాష్ట్ర నేతలు కాంగ్రెస్, బీజేపీ, శివసేన పార్టీలలోకి జంప్ అయిపోయారు. దీనితో అక్కడ ఏర్పాటు చేసిన పార్టీ కార్యాలయాలు ఒక్కొక్కటిగా మూతపడుతున్నాయి. 2022 తరువాత పేరు మార్చుకున్న తెరాస మహారాష్ట్రలో జరిగిన కొని ఎన్నికలలో తన పార్టీ తరుపున అభ్యర్థులను ఎన్నికల బరిలోకి దింపింది.

అయితే సొంత రాష్ట్రంలోనే పార్టీ ఓటమి పాలవడం ఇక పక్క రాష్ట్రాలలో ఏమాత్రం ప్రభావం చూపగలదు అని భావించారో ఏమో కానీ బిఆర్ఎస్ పార్టీ సభ్యత్వం తీసుకున్న వారందరు పక్క పార్టీలలోకి జారుకోవడంతో అక్కడ కేసీఆర్ కారు పూర్తిగా ఖాళీ అయిపొయింది. ఇక ఏపీ విషయానికి వస్తే మాజీ ఐఏఎస్ తోట చంద్రశేఖర్ ను ఏపీ బిఆర్ఎస్ అధ్యక్షుడిగా నియమించి పార్టీ కార్యలయాన్ని ఏర్పాటు చేసి “ఈ సారికూడా తన రహస్య మిత్రుడికి అనధికార సాయం చేయాలనుకున్న కేసీఆర్ ఆశలు ఆంధ్రా బోర్డర్ దాటలేక అవస్థలు పడుతున్నాయి”.

ఇక పొరుగు రాష్ట్ర రాజకీయాల మీద ద్రుష్టి పెట్టి సొంత రాష్ట్రంలో చేతులు కాల్చుకుంటారో లేక హస్తం దెబ్బకి షెడ్ కెళ్లిన కారుని రిపేర్ చేసి తెలంగాణ రోడ్ల మీదకు తెస్తారో నిర్ణయించుకోవాల్సిన సమయం బిఆర్ఎస్ నేతలకు ఆసన్నమయింది. ఓటమితో నిరుత్సహంలోకి వెళ్లిన నేతలను ఉద్దేశించి కార్ సర్విసింగుకి మాత్రమే వెళ్లిందని, ఎవరు కంగారు పడాల్సిన పనిలేదని చెప్పుకొస్తున్న కేటీఆర్ పార్లమెంట్ ఎన్నికలలో అయిన కారు గ్యారేజిలోకి వెళ్ళకుండా చూసుకోవాలి.

ప్రజాస్వామ్యంలో ఎవరు ఎక్కడి నుంచి అయిన పోటీ చేయవచ్చు అనే కనీస రాజకీయ సిద్ధాంతాలను కూడా తుంగలో తొక్కి “ఆంధ్రోళ్ల పెత్తనం” మన తెలంగాణ ప్రజలకు అవసరమా..? అంటూ ప్రజలను రెచ్చకొట్టి, ఇతర రాజకీయ పార్టీల మీద రెచ్చిపోయిన కేసీఆర్ కు ఇక “దొరల పాలన” మాకు అవసరం లేదు అంటూ రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు తెలంగాణ ప్రజలు. అందుకే అంటారు “చేసుకున్నోడోకి చేసుకున్నంతా” అని.

ADVERTISEMENT
Latest Stories