ప్రిన్స్ మహేష్ బాబు తన సినిమా వేడుకలకు మరియు తన కుటుంబ సభ్యుల సినీ వేడుకలకు తప్ప మరే ఇతర హీరోల ఈవెంట్స్ కు పెద్దగా హాజరు కారన్న విషయం తెలిసిందే. ఎక్కువగా సుధీర్ బాబు నటించే సినిమాల ఈవెంట్స్ కు హాజరయ్యే మహేష్, ఈ సారి తన సోదరి మంజుల నిర్మించబోయే సినిమాకు కూడా హాజరు కాక తప్పదని తెలుస్తోంది.
ప్రస్తుతం సందీప్ కిషన్ హీరోగా ఓ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న మంజుల, తర్వాత నాని హీరోగా ‘ఇందిరా ప్రొడక్షన్స్’ సంస్థపై ఓ చిత్రాన్ని నిర్మించనుందని తెలుస్తోంది. ‘మనం’ చిత్ర దర్శకుడు విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో నాని నటించబోయే సినిమాకు ప్రిన్స్ సోదరిమణి మంజులనే నిర్మాతగా వ్యవహరిస్తున్నట్లు ట్రేడ్ వర్గాల సమాచారం.
వరుస సక్సెస్ లతో దూసుకుపోతున్న నాని చేయబోయే ఈ సినిమా ప్రారంభోత్సవ వేడుకకు ప్రిన్స్ మహేష్ బాబు విచ్చేసే అవకాశముందని తెలుస్తోంది. సోదరి మంజుల నిర్మిస్తోన్న చిత్రం కావడంతో పాటు, ‘మనం’ చిత్ర దర్శకుడు విక్రమ్ కె కుమార్ తోనూ మహేష్ కు సాన్నిహిత్యం ఉంది. దీంతో నాని సినీ వేడుకకు ప్రిన్స్ రాక అనివార్యం కానుందని టాక్.


