ఎవ్వరు ఊహించని విధంగా కేసీఆర్ ను గద్దె దింపి తెలంగాణ రాష్ట్ర అధికార పగ్గాలు చేపట్టిన రేవంత్ రెడ్డి తాను అనుకున్న లక్ష్యాన్ని అయితే ఛేదించగలిగారు కానీ ప్రజలు ఆశించిన పాలన అందించగలుగుతున్నారా.? ప్రతిపక్షాలను నోరి మూపించేలా అడుగులు వేయగలుగుతున్నారా.? అంటే ఆ ప్రశ్నకు ఇంకా సమాధానం కనిపించలేదనే చెప్పాలి.
ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజున ప్రగతి భవన్ కంచెలు తీసి ఇక తెలంగాణలో దొరల పాలన ముగిసింది…ఇప్పటి నుంచి ప్రజా పాలనే అంటూ సినిమా హీరో లెవెల్ లో ప్రసంగాలు చేసారు. అయితే ఆ ప్రజా పాలన హైడ్రాతో పక్కదారి పట్టింది అనే వాదన తెలంగాణ ప్రజలలో ముఖ్యంగా హైద్రాబాద్ వాసులలో బలంగా నాటుకుపోయింది.
కూల్చివేశారన్న బాధకంటే ఆ కూల్చిన విధానాలే హైడ్రా బాధితులను మరింత బాధపెట్టాయి, ప్రజలను ప్రతిపక్షాల వైపు చూసేలా చేసాయి. అలాగే ఎన్నోఏళ్ల నుంచి నిరుద్యోగులు కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూసిన గ్రూప్ 1 , నోటిఫికేషన్ కు జిఓ..29 జోడించడంతో కాంగ్రెస్ ప్రభుత్వానికి, రేవంత్ నిర్ణయానికి వ్యతిరేకంగా కథం తొక్కారు తెలంగాణ యువత.
ఇక తెలంగాణ తల్లి విగ్రహ మార్పు నిర్ణయంతో, సినీ ఇండస్ట్రీ తో ఎదురైనా వివాదాలతో ముందడుగు వేసిన రేవంత్ రెడ్డిని తెలంగాణ సమాజం, తెలుగు ప్రజలు జగన్ మోహన్ రెడ్డి తో పోల్చి చూసారు. ఇలా అనవసరపు మార్పులతో లేనిపోని వివాదాలు సృష్టించుకుని షెడ్ కి వెళ్లిన బిఆర్ఎస్ కారును చేచేతుల బయటకు తీస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం.
అయితే ఇదంతా జరిగిపోయిన గతం, కానీ ఇక ముందు రాబోయే భవిష్యత్ కాలం కాంగ్రెస్ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డికి అత్యంత కీలకమైన సమయం. ఈ గడిచిన ఏడాదిలో వివాదాలతో తప్ప విధానాలతో తన మార్క్ పాలన చూపించలేకపోయిన రేవంత్ ఇక నుంచి ఆ దిశగా అడుగులు వేయాలి.
అయితే ఇప్పటి వరకు రాజకీయాలకు కాస్త గ్యాప్ ఇచ్చిన బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈ ఏడాదిలో ప్రజల మధ్యకు రానున్నట్టు పార్టీ వర్గాలు చెపుతున్నాయి. దీనితో రేవంత్ ఒకపక్క తన పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేస్తూనే మరోపక్క కేసీఆర్ లాంటి సీనియర్ రాజకీయ నాయకుడి రాజకీయాన్ని తట్టుకుంటూ ముందుకెళ్లగలగాలి.
ఇప్పటికే ప్రజలు వ్యతిరేకతతో హైడ్రా మీద వెనకడుగు వేసిన రాష్ట్ర ప్రభుత్వం ఇక ముందు తీసుకోబోయే నిర్ణయాల మీద పునః పరిశీలించుకోవాలి. అలాగే గత ప్రభుత్వంలో ఐటీ మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన కేటీఆర్ తన మొదటంకంలోనే హైద్రాబాద్ ను వృద్ధి చేస్తూ తన మార్క్ రాజకీయం చూపించారు, తన విధానాలను వివరించారు.
ఇక హరీష్ రావు విషయానికి వస్తే సొంత పార్టీలోనే తనకంటూ ఒక సొంత వర్గాన్ని ఏర్పాటు చేసుకుని పార్టీ అధినేత కేసీఆర్ ను కూడా అదుపు చేయగలిన ఒక బలమైన నేతగా ఎదిగారు. పార్టీ బలోపేతానికి, పార్టీని ప్రజలలో తీసుకెళ్లడానికి కవిత కూడా చాల బలమైన పాత్ర పోషించగలదు.
ఇలా బిఆర్ఎస్ పార్టీ తరపున బలైమన గొంతు వినిపించడానికి కేసీఆర్ కు తోడు హరీష్ రావు, కేటీఆర్, కవిత ఆపార్టీకి మూలా స్తంభాలుగా నిలబడతారు. వారందరిని దాటుకుంటూ ముందుకెళ్లడమే కాదు వారందరిని మరిపించేలా పాలన చేస్తూ ప్రజల మెప్పు పొందడం రేవంత్ సర్కార్ కు కత్తి మీద సాము వంటిదే.
అయితే సీనియర్ నాయకులు వారి అనుభవంతో కొట్టే రాజకీయ దెబ్బ ఏపాటి ప్రభావాన్ని చూపిస్తుందో 2024 ఏపీ ఎన్నికలను పరిశీలిస్తే అర్డమవుతుంది. కాబట్టి సీనియర్ రాజకీయ నాయకులను వయసు మళ్ళిన నాయకులు గా కాకుండా అనుభవం కలిగిన నేతగా గుర్తించాలి, గౌరవించాలి.




