మద్యం కుంభకోణం కేసులో ఏ-4గా ఉన్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఏసీబీ కోర్టు ఆగస్ట్ 1 వరకు జ్యూడిషియల్ రిమాండ్ విధించింది. ఆయన అభ్యర్ధన మేరకు విజయవాడ జైలుకు బదులు సౌకర్యవంతంగా ఉండే రాజమండ్రి సెంట్రల్ జైలుకి తరలించాలని న్యాయస్థానం ఆదేశించింది.
జగన్ సహా వైసీపీ నేతలందరూ ఈ కేసుతో మిథున్ రెడ్డికి ఎటువంటి సంబంధమూ లేదని, కేవలం రాజకీయ కక్షతోనే తప్పుడు కేసు సృష్టించి అరెస్ట్ చేశారని వాదిస్తున్నారు. మిథున్ రెడ్డి కూడా కోర్టులో ఇదే చెప్పుకున్నారు.
కానీ అయన అరెస్ట్పై జగన్తో సహా వైసీపీ నేతలందరూ తీవ్రంగా స్పందిస్తున్న తీరు చూస్తున్నప్పుడు ఎందుకింత అతిగా స్పందిస్తున్నారు? అసలు మద్యం కుంభకోణమే జరుగలేదని, ఈ కేసు ఓ అభూత కల్పనని గట్టిగా వాదిస్తున్నప్పుడు ఇంతగా ఆందోళన చెందాల్సిన అవసరం ఏమిటి? అనే సందేహం కలుగక మానదు.
జగన్, మిథున్ రెడ్డి కోట్లు కుమ్మరించి పేరు మోసిన న్యాయవాదులను తెచ్చుకోగలరు. ఇది ఎలాగూ భూటకపు కేసని జగన్తో సహా అందరూ తేల్చి చెప్పేశారు కనుక వారి న్యాయవాదులు ఈ కేసుని చిటికలో పరిష్కరించగలరు.
ఆ నమ్మకంతోనే ఈ కేసులో అరెస్ట్ అయిన వైసీపీ నేతలందరూ ఆణిముత్యాల్లా బయటకు వచ్చేస్తారని వైసీపీ నేతలే చెప్పుకుంటున్నారు కదా?కనుక మిథున్ రెడ్డి అరెస్ట్ అయితే ఇంత ఆందోళన దేనికి?
వైసీపీ నేతలందరూ అరెస్ట్ అయ్యింది మిథున్ రెడ్డి కాదు… జగన్ అరెస్ట్ అయినంతగా ఆందోళన చెందుతున్నారు!ఎందుకు అంటే ఏసీబీ చెప్పినట్లు ఈ కేసులో మిథున్ రెడ్డిది చాలా కీలకపాత్ర అని వారికి కూడా తెలుసు గనుకనే! లేదా మిథున్ రెడ్డి అరెస్ట్ తర్వాత జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తారని వారికి తెలిసి ఉన్నందునే అని అనుకోవచ్చు.
“ఈ సిట్టూ బట్టూ తమని ఏమీ చేయలేవని, కేవలం అరెస్ట్ చేసి జైలుకి పంపగలవని, తాము వెంటనే బెయిల్పై బయటకు వచ్చేయగలమని వైసీపీ మాజీ ఎమ్మెల్యే రాచమల్లు చెప్పారు. కనుక వైసీపీ నేతల హడావుడికి మరో బలమైన కారణం కూడా కనిపిస్తోంది. కూటమి ప్రభుత్వం తమని వేధిస్తోందని గట్టిగా నొక్కి చెపుతూ ప్రజల సానుభూతి పొందేందుకే అనుకోవలసి ఉంటుంది.
లేకుంటే ఇదే కేసులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వంటిపలువురిని అరెస్ట్ అయినప్పుడు జగన్, వైసీపీ నేతలు ఇంతగా స్పందించలేదు. ఇంత హడావుడి చేయలేదు. ఇంత ఆందోళన చెందలేదు కదా?కనుక వైసీపీ నేతల ఆందోళనతోనే తేటతెల్లమవుతోంది ఇది భూటకపు కేసో కాదో.




