విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్ కున్న ప్రాముఖ్యత తెలియనిది కాదు. ఆసియాలోనే అత్యంత విశాలమైన బస్టాండ్ లలో రెండవ స్థానాన్ని దక్కించుకున్న దీనిని పునర్నిర్మాణం చేసిన ఘనత స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావుకు దక్కుతుంది. ఎన్టీఆర్ హయంలో విజయవాడకే కాదు, దేశానికి తలమానికంగా సువిశాలమైన ప్రదేశంలో అప్పట్లో ఉన్న అత్యాధునిక సౌకర్యాలతో బస్టాండ్ ను నిర్మించిన ఘనతను సొంతం చేసుకున్నారు. అప్పటినుండి రాష్ట్ర విభజన వరకు పెద్దగా మార్పులేవీ సంభవించలేదు.
అంటే దాదాపుగా రెండు దశాబ్దాలుగా విజయవాడ అభివృద్ధికి నోచుకోలేదన్న విషయం… నగరంలోకి ప్రవేశించగానే బస్టాండ్ రూపురేఖలే అందరికీ చెప్తాయి. అయితే విభజన తర్వాత ఏపీలో విజయవాడ ప్రాముఖ్యత చాలా కీలకంగా మారింది. ముఖ్యంగా రవాణా వ్యవస్థకు సెంటర్ పాయింట్ గా ఉండడంతో ప్రభుత్వ పరంగా పెంచాల్సిన వసతులన్నీ ఒక్కొక్కటిగా పెంచుకుంటూ వస్తున్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత… ప్రయాణికుల వసతులు, సౌకర్యాలను దృష్టిలో పెట్టుకుని, ప్రయాణికులు కూర్చోవడానికి అనుగుణంగా బస్టాండ్ ను అత్యాధునిక వసతులతో మెరుగుపరిచారు. మునుపటితో పోలిస్తే… పారిశుధ్యం కూడా మెరుగుపడిందని స్థానికులు చెప్తున్నారు.
తాజాగా దేశంలోనే మొట్టమొదటిసారిగా ఎపీఆర్టీసీ బస్టాండ్ లో ఒక మినీ ధియేటర్ ను నిర్మించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ప్రారంభమైన ఈ ‘మినీ ధియేటర్’లో ఇక నుండి సినిమాలు చూసుకోవచ్చు… అంటూ సిఎం ట్వీట్ చేసారు. మొదటి టికెట్ ను కొనుగోలు చేసిన చంద్రబాబు, సదరు ధియేటర్ యొక్క ఫోటోలను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. కొత్తగా నిర్మించినటువంటి ఏపీఎస్ఆర్టీసీ భవన్లో ఈ మినీ ధియేటర్ ను ఏర్పాటు చేసారు.




