మంత్రి బొత్స కమిట్ అయ్యారు… తధాస్తు!

Botsa Satyanarayanaఓ వైపు టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ప్రాజెక్టుల గురించి జగన్ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. మరో పక్క టిడిపి యువనేత నారా లోకేష్‌ యువగళం పాదయాత్రలో ప్రతీ అడుగులో జగన్ ప్రభుత్వ అసమర్ధత, వైసీపీ నేతల అవినీతి, అక్రమాల గురించి ఫోటోలతో సహా నిలదీసి అడుగుతుంటారు.

మొన్నటిదాకా బుద్దిగా సినిమాలు చేసుకొనే పవన్‌ కళ్యాణ్‌ని కూడా వైసీపీ నేతలు కెలికొదిలి పెట్టడంతో ఆయన హైదరాబాద్‌ నుంచి నేరుగా మంగళగిరి వచ్చేసి వారాహి యాత్రలతో అదరగొట్టేస్తున్నారు. లేటుగా వచ్చిన లేటెస్టుగా వస్తానంటూ దగ్గుబాటి పురందేశ్వరి అప్పుడే రంగంలో దిగిపోయి గ్రామపంచాయితీల నిధుల గురించి నిలదీస్తున్నారు. ఇంకా జేపీ నడ్డా, అమిత్‌ షాలకు తీరికలేక గానీ… లేకపోతే వారు కూడా ఏపీకి వచ్చి వైసీపీ ప్రభుత్వానికి ఓ రౌండ్ వేసేవారే.

ADVERTISEMENT

బహుశః ఇవన్నీ చూసే సిఎం జగన్‌ ఒంటరివాడనయ్యానని బాధపడుతుంటారు. పాదయాత్రలో అందరి తలల మీద చేతులు వేసి ఆశీర్వదించిన జగన్‌ దేవుడు, ఇప్పుడు మీ ఈ బిడ్డను మీరే కాపాడుకోవాలని ప్రజలను వేడుకొంటుండటమే విచిత్రంగా ఉంది.

ఇక విషయానికి వస్తే నలువైపుల నుంచి శత్రుసైన్యాలు చుట్టుముట్టడంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న మంత్రులు ‘ఈజీ టార్గెట్’ పవన్‌ కళ్యాణ్‌ని ఎంచుకొని ఎదురుదాడి చేస్తూ అధినేత మెప్పుకోసం ఆరాటపడుతున్నారు. వారిలో మంత్రి బొత్స సత్యనారాయణ కూడా ఒకరు.

శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం పరిధిలోని రణస్థలంలో గడప గడపకి….. కాదు కాదు… ‘గడప గడపకి విజయోత్సవసభ’లో పాల్గొన్నారు. కానీ ప్రజలు చీదరించుకొంటుంటే ఈ కార్యక్రమం ఎప్పుడు, ఎలా విజయవంతం అయ్యిందో వారికే తెలియాలి.

ఈ సందర్భంగా ఆయన చిలక జోస్యం చెప్పి ఓ సవాల్ కూడా చేశారు. వచ్చే ఉగాది నాటికి రాష్ట్రంలో టిడిపి, జనసేనలు రెండూ ఉండవని ఉంటే గుండు గీయించుకొంటానని సవాల్ విసిరారు. కాగల కార్యం గంధర్వులు చేయడం అంటే ఇదేనేమో?

గత ఎన్నికలలో వైసీపీ ప్రభంజనం ఏర్పడింది కానీ వచ్చే ఎన్నికలలో ఎటువంటి ప్రభంజనమూ ఉండబోదు. టిడిపి, జనసేనల నుంచి గట్టి పోటీ ఉంటుంది. ఒకవేళ కేసీఆర్‌, వైఎస్ షర్మిల కూడా ఎంట్రీ ఇస్తే పరిస్థితి ఇంకా అధ్వానంగా మారవచ్చు. కనుక వచ్చే ఎన్నికలలో టిడిపి, జనసేనలు ఓడినా, గెలిచినా, వైసీపీకి మాత్రం పదవీ గండం తప్పక ఉంటుంది.

ఒకవేళ వైసీపీ అధికారం కోల్పోతే ఇన్నేళ్ళుగా టిడిపి, జనసేనలని ఫుట్ బాల్‌ ఆడుకొన్నందుకు వైసీపీ నేతల పరిస్థితి ఇంకా అధ్వానంగా మారవచ్చు. కనుక మంత్రి బొత్స చెప్పిన్నట్లు ఎవరు ఎవరికి గుండు కొడతారో ఉగాదికే ఖచ్చితంగా తేలిపోవచ్చు.

ADVERTISEMENT
Latest Stories