రెండు నిమిషాలకు సరిపడే షార్ట్ ఫిలిమ్ కధని వెబ్ సిరీస్గా సాగదీస్తే?ఆ నరకం ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. ఏపీలో ప్రభుత్వోద్యోగుల సిపిఎస్ కధ కూడా అలాగే మొదలుపెట్టి అలాగే సాగదీసి అలాగే ముగించేసింది వైసీపి ప్రభుత్వం.
“నేను ముఖ్యమంత్రి కాగానే వారం రోజులలోనే సీపీఎస్ రద్దు చేస్తాను,” అని జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఆ తర్వాత ఎన్నికల ప్రచారంలో కూడా పదేపదే చెప్పారు. అంటే జస్ట్ ఆయన ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోగానే ఒక్క సంతకంతో ఆ కధ ముగించేస్తానని చెప్పారన్న మాట!
కానీ షార్ట్ ఫిలింలా ముగించేస్తానన్న సీపీఎస్ రద్దు అంశాన్ని పట్టుకొని దాదాపు నాలుగున్నరేళ్ళపాటు సాగదీస్తూ ప్రభుత్వోద్యోగులు సహనం పరీక్షించారు. అయినా మడమ తిప్పని, మాట తప్పని ముఖ్యమంత్రి కనుక ప్రభుత్వోద్యోగులు అందరూ చాలా సహనంగా ఆ టార్చర్ భరించారు.
కాస్త ఆలస్యమైన ఆ హామీని అమలుచేశారా?అంటే చావు కబురు చల్లగా చెప్పిన్నట్లు “కేంద్ర ప్రభుత్వం ఇందుకు అంగీకరించడం లేదని కనుక ఈవిషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఏమీ చేయలేదని’ బొత్స సత్యనారాయణ చల్లగా చెప్పేశారు. అంతే కాదు… ‘ఇదొక ముగిసిన అధ్యాయం’ అని కూడా మంత్రిగారు తేల్చి చెప్పేశారు.
జీపీఎస్ అనేది రాష్ట్ర ప్రభుత్వ విధానమని, కనుక దానినే అమలుచేస్తామని కూడా చెప్పేశారు. కనుక ఉద్యోగ సంఘాల నేతలందరూ అర్దం చేసుకొని ప్రభుత్వానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. జీపీఎస్ విధానంలో ఉద్యోగ సంఘాల నేతలు ఏమైనా చర్చించదలచుకొంటే ప్రభుత్వం తలుపులు ఎల్లప్పుడూ వారితో చర్చలకు తెరిచే ఉంటాయని కూడా చెప్పారు. ఇదీ వెబ్ సిరీస్గా మారిన షార్ట్ ఫిలిం కధ!
కనీసం ఇప్పటికైనా మాట తప్పిన్నట్లు, మడమ తిప్పిన్నట్లు ఒప్పుకొంటారో లేదో ఏలినవారు?



