టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుపై ఏపీ సీఐడి సోమవారం ఏసీబీ కోర్టులో మరో పిటిషన్ దాఖలు చేసింది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ వ్యవహారంలో అవినీతికి పాల్పడ్డారని కనుక ఆయనను విచారించేందుకు పీటీ వారెంట్ (ప్రిజనర్ ఇన్ ట్రాన్సిస్ట్) అనుమతి కోరుతూ పిటిషన్ వేసింది.
ఈ కేసులో చంద్రబాబు నాయుడుతో పాటు నారా లోకేష్, మాజీ మంత్రి నారాయణ పేర్లను కూడా చేర్చింది. సోమవారం మధ్యాహ్నం 2.30 గంటల నుంచి ఈ పిటిషన్పై విజయవాడ ఏసీబీ కోర్టులో వాదనలు మొదలవనున్నాయి.
ఈ తాజా కేసుపై మంత్రి రోజా స్పందిస్తూ, “చంద్రబాబు నాయుడుతో సహా నారా లోకేష్, అచ్చెన్నాయుడు టిడిపిలో ఇంకా చాలామందిపై వరుసపెట్టి కేసులు నమోదు కాబోతున్నాయి. టిడిపిలో చాలా మంది నేతలను మళ్ళీ మళ్ళీ అరెస్ట్ చేస్తూనే ఉంటాము. జైలుకి పంపిస్తూనే ఉంటాము. కనుక టిడిపిలో అందరూ సిద్దంగా ఉండాలి.
ఇంతకాలం టిడిపి నేతలు, వారి మీడియా జగన్మోహన్ రెడ్డిని జైల్లో ఉండివచ్చావంటూ ఎద్దేవా చేసేవారు. మరిప్పుడు వారు కూడా జైలుకి వెళ్ళారు. కనుక ఇకపై మేము కూడా ‘జైలు చౌదరి’, ‘జైలు నాయుడు’ అని పిలుస్తాము,” అని మంత్రి రోజా ఎద్దేవా చేశారు.
నారా లోకేష్, అచ్చెనాయుడుతో సహాయ టిడిపి ముఖ్య నేతలందరిపై మళ్ళీ మళ్ళీ కేసులు వేస్తూ అరెస్ట్ చేస్తూనే ఉంటామని మంత్రి రోజా చెప్పడం చూస్తే జగన్ ప్రభుత్వం టిడిపి నేతలపై రాజకీయకక్షసాధింపులకు పాల్పడుతోందని, ఎన్నికలలోగా ఆ పార్టీని భూస్థాపితం చేసేయాలని ఆరాటపడుతోందని స్పష్టమవుతోంది.
జగన్, విజయసాయి రెడ్డి 16 నెలలు జైల్లో ఉండి వచ్చారు కనుక చంద్రబాబు నాయుడుని కూడా జైల్లో పెట్టి ఆయనకు మరక అంటించి ప్రజల దృష్టిలో దోషిగా నిలబెట్టాలనే దురుద్దేశ్యంతోనే వైసీపి ప్రభుత్వం ఈవిదంగా తమపై అక్రమకేసులు బనాయిస్తోందని టిడిపి నేతలు చేస్తున్న వాదనలు కూడా నిజమేనని మంత్రి రోజా మాటలతో స్పష్టమవుతోంది.
గతంలో టిడిపి ఇలాంటి అగ్నిపరీక్షలు చాలానే ఎదుర్కొంది. భయటపడింది. మారిప్పుడు వైసీపి ప్రభుత్వం విసురుతున్న ఈ సవాళ్ళను టిడిపి ఏవిదంగా ఎదుర్కొని బయట పడుతుందో చూడాలి.



