తిరుమల శ్రీవారి ఆలయంపై వైసీపీ మంత్రుల దండయాత్రలు కొనసాగుతున్నాయి. నెలరోజుల క్రితం మంత్రి సీదిరి అప్పలరాజు సుమారు 150 మంది అనుచరులతో శ్రీవారిని దర్శించుకొని తన సత్తా చాటుకొన్నారు. ‘మేము మాత్రం తక్కువా?’ అన్నట్లు రోజుల క్రితం మంత్రి ఉషశ్రీ 50 మంది అనుచరులతో బ్రేక్ దర్శనాలు చేసుకొని తన ప్రతాపం చూపించారు. ‘ఎక్కడెక్కడి మంత్రులో మంది మార్భలాన్ని వెంటపెట్టుకొని దర్జాగా వెళ్ళి శ్రీవారిని దర్శించుకొంటుంటే, జిల్లా మంత్రిని నేను వెళ్ళి నా తడాఖా చూపకపోతే ప్రజలు నన్ను గుర్తిస్తారా?’ అనుకొంటూ మంత్రి రోజా ఈరోజు 30 మంది అనుచరులను వెంటబెట్టుకొని బ్రేక్ దర్శనం చేసుకొన్నారు.
తిరుమలలో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఈనెల 21వరకు విఐపి బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. అయినప్పటికీ మంత్రులు టీటీడి అధికారులపై ఒత్తిడి తెచ్చి అనుచరులతో కలిసి బ్రేక్ దర్శనాలు చేసుకొంటున్నారు. ఇది వారి అధికార దర్పం, బలప్రదర్శన చేయడమే తప్ప భక్తి అనిపించుకోదు.
ఓ పక్క వేలాదిమంది సామాన్య భక్తులు 12-24 గంటలసేపు క్యూ లైన్లలో నిలబడి శ్రీవారి దర్శనం కోసం ఎదురుచూస్తుంటే, వైసీపీ మంత్రులు అనుచరులతో బ్రేక్ దర్శనం కోసం రెండేసి గంటలు దర్శనాలు నిలిపివేస్తుండటం చూస్తుంటే తిరుమలకు కూడా వైసీపీ అరాచకాలు వ్యాపించినట్లే ఉన్నాయి.
అనేక ఏళ్లుగా మంత్రి పదవి కోసం ఆరాటపడిన ఆర్కె. రోజాకు ఎట్టకేలకు జగన్ మంత్రివర్గంలో పర్యాటకశాఖ మంత్రి పదవి లభించింది. మంత్రి పదవి చేపట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆమె జిల్లాల పర్యటనలు చేసి పర్యాటకాభివృద్ధి గురించి ఆలోచించనే లేదు. కానీ ఈ మూడు నెలల్లోనే ఆమె ఓ 7-8 సార్లు శ్రీవారి దర్శనం చేసుకొన్నారు.
బహుశః ఆమె పేరుకే మంత్రి తప్ప ఆమె చేతిలో నిధులు, అధికారాలు ఉండవు కనుక పక్కనే ఉన్న తిరుమలకు, అప్పుడప్పుడు తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి తిరుగుతూ జగన్ భజన చేస్తూ కాలక్షేపం చేస్తున్నట్లున్నారు. తిరుమలపై మంత్రుల దండయాత్రలు చూస్తుంటే జగన్ మంత్రివర్గంలో ఆమె ఒక్కరి పరిస్థితే ఈవిదంగా ఉందా లేక అందరిదీ ఇదే పరిస్థితా?అనే సందేహం కలుగుతోంది.



