అధికారం చేతిలో ఉంటే దాంతో ప్రజలకు, రాష్ట్రానికి మేలు చేయాలి కానీ కాకినాడ వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశ్రేఖర్ రెడ్డి కాకినాడ ఎడ్యుకేషన్ సొసైటీ భూములను స్వాహా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని టిడిపి రాష్ట్ర కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ఆరోపించారు.
నిన్న కాకినాడలోని టిడిపి కార్యాలయంలో విలేఖరులతో మాట్లాడుతూ, “కాకినాడ ఎడ్యుకేషన్ సొసైటీకి విరాళాల రూపంలో వచ్చిన సొమ్ముతో భవిష్యత్ అవసరాల కోసం శశికాంత్ నగర్లో 3.14 ఎకరాలు, తిమ్మాపురంలో 10 ఎకరాలు సొసైటీ పేరున కొనుగోలు చేశారు. అత్యంత విలువైన ఆ భూములపై వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశ్రేఖర్ రెడ్డి కన్ను పడింది. దాంతో ఆయన కౌన్సిల్ మీటింగ్లో వాటిని నివాసయోగ్యమైన స్థలాలుగా తీర్మానం చేయించుకొన్నారు. ఆ భూములను ఆయన కబ్జా చేసి వాటిలో లేఅవుట్ ఏర్పాటు చేసి అమ్మేసుకొందామని ప్రయత్నిస్తున్నారు. ఒకవేళ ఆయన అటువంటి ప్రయత్నం చేస్తే నేను కోర్టుని ఆశ్రయించి అడ్డుకొంటాను. ద్వారంపూడికి సహకరించినందుకు కౌన్సిల్ సభ్యులు, కార్పొరేషన్ కమీషనర్ని బాధ్యులు చేస్తూ పిటిషన్ వేస్తాను,” అని మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు హెచ్చరించారు.
నగర టిడిపి అధ్యక్షుడు మల్లిపూడి వీరు, ప్రధాన కార్యదర్శి తుమ్మల రమేష్, టిడిపి నాయకులు బంగారు సత్యనారాయణ, చింతపూడి రవి, పలివెల రవి, అనంతకుమార్, అంబటి చిన్న, హోతా రవి తదితరులు ఈ ప్రెస్మీట్లో పాల్గొన్నారు.



