అసెంబ్లీలో అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గానూ స్పీకర్ కోడెల శివప్రసాద్ చేత ఒక ఏడాది పాటు అసెంబ్లీ సస్పెన్షన్ కు గురైన వైసీపీ నేత రోజా, దానిని తొలగించుకునేందుకు తొలుత హైకోర్ట్ కు వెళ్లి భంగపడగా, తర్వాత సుప్రీంకోర్టులో కూడా చేదు అనుభవాలను చవిచూసిన సంగతి తెలిసిందే. ఈ వివాదానికి పరిష్కారం లభించక ముందే మరోమారు నగరి ఎమ్మెల్యే సుప్రీంకోర్టు తలుపుతట్టారు.
గత సార్వత్రిక ఎన్నికల్లో నగరి నియోజకవర్గం నుండి గెలుపొందిన రోజా ఎన్నిక చెల్లదంటూ హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. దీనికి సంబంధించి నోటీసులు అందుకున్న రోజా, దీనిని కొట్టివేయాలంటూ మరో పిటిషన్ దాఖలు చేసింది. ఈ రెండింటికి విచారణకు స్వీకరించిన హైకోర్ట్… ఒకే అంశం కనుక, రెండు పిటిషన్లపై ఒకేసారి వాదనలు వింటామని ప్రకటించారు. అయితే దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ రోజా సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
రెండు పిటిషన్లను వేరువేరుగా వినేలా హైకోర్ట్ కు ఆదేశాలు ఇవ్వాలని రోజా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, విచారణకు స్వీకరించిన అత్యున్నత న్యాయస్థానం జూన్ నెలాఖరున విచారణ చేపడతామని తెలిపారు. దీంతో సుప్రీంలో ఏం జరుగుతుందో అన్న ఆసక్తి రాజకీయ వర్గాల్లో వినపడుతోంది. ఈ సారి ఏకంగా రోజా ఎమ్మెల్యే స్థానానికి సంబంధించినది కావడంతో అంశం మిక్కిలి ఉత్కంఠగా మారింది.



