తెలంగాణ శాసనసభకు నవంబర్ నెలాఖరులోగా ఎన్నికలు జరుగనున్నాయి. అంటే మూడు నెలలు కూడా లేవన్నమాట. అందుకే ఆ రాష్ట్ర సిఎం కేసీఆర్ 115 మంది అభ్యర్ధుల జాబితా కూడా ప్రకటించారు. ఆ జాబితాలో సిట్టింగ్ ఎమ్మెల్యేలు దాదాపు అందరికీ మళ్ళీ టికెట్స్ ఖరారు చేశారు.
కనుక వారందరూ సంతోషంతో ఎన్నికల గంట కోసం ఆతృతగా ఎదురుచూస్తూంటే, తెలంగాణ హైకోర్టు వరుసపెట్టి వారిని ఎమ్మెల్యేలుగా అనర్హులని ప్రకటిస్తూ, గత ఎన్నికలలో వారి చేతిలో ఓడిపోయిన అభ్యర్ధులను ఎమ్మెల్యేలుగా పరిగణించాలని తీర్పు చెపుతోంది!
ఇప్పటికే కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుని అనర్హుడిగా ప్రకటించిన హైకోర్టు, ఇవాళ్ళ గద్వాల్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డిని అనర్హుడిగా ప్రకటించి, ఆయన చేతిలో ఓడిపోయిన బిజెపి మహిళా నేత డికె అరుణని ఎమ్మెల్యేగా ప్రకటించింది!
తెలంగాణ హైకోర్టులో మరో 20 మంది ఎమ్మెల్యేలపై ఇటువంటి కేసులే పెండింగులో ఉన్నాయి. వారందరూ తప్పుడు అఫిడవిట్లు సమర్పించి ఎన్నికలలో పోటీ చేసి గెలిచారంటూ కోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి.
అయితే మళ్ళీ ఎన్నికలు వచ్చేస్తున్నా హైకోర్టు వాటిపై తీర్పు చెప్పకపోవడంతో సుప్రీంకోర్టు ఈనెలాఖరు వరకు గడువు విధించింది. దీంతో రాబోయే వారం రోజులలో మరికొంతమంది బిఆర్ఎస్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడే సూచనలు కనిపిస్తున్నాయి. దాదాపు 5 ఏళ్ళు ఎమ్మెల్యేలుగా దర్జా వెలగబెట్టి, సరిగ్గా ఎన్నికలకు ముందు హైకోర్టు చేత అనర్హులుగా ప్రకటింపబడటం చాలా ఇబ్బందికరం…చాలా విచిత్రమే కదా?
ఇక మరో మూడు నెలల్లో ఎన్నికలు జరుగబోతుంటే, సిఎం కేసీఆర్ ఇవాళ్ళ పట్నం మహేందర్ రెడ్డి అనే సీనియర్ నేతని మంత్రివర్గంలోకి తీసుకోవడం మరో విశేషం. ఈరోజు మధ్యాహ్నం రాజ్భవన్లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆయన చేత మంత్రిగా ప్రమాణస్వీకారం చేయించారు.
తాండూరు నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేయాలనుకొన్నారు. కానీ కేసీఆర్ రోహిత్ రెడ్డికి ఆ టికెట్ కేటాయించారు. కనుక పట్నం మహేందర్ రెడ్డి పార్టీని వీడినా, తిరుగుబాటు చేసినా చాలా ఇబ్బందిపడాల్సి వస్తుందని ఆయనకు ‘మూడు నెలల మంత్రిగా’ కేసీఆర్ అవకాశం కల్పించారు. ఇది మరో విచిత్రం.
ఇక గత రెండు మూడేళ్ళుగా గవర్నర్పై కత్తులు దూస్తున్న సిఎం కేసీఆర్, ఆమెను అధికారిక కార్యక్రమాలకు ఆహ్వానించడం లేదు. రాజ్భవన్కు మంత్రులు, ఉన్నతాధికారులను పంపించడం లేదు. కానీ ఇవ్వాళ్ళ ఆమె ప్రమాణస్వీకారం చేయించవలసి ఉండటంతో కేసీఆర్తో సహామంత్రులు, ఉన్నతాధికారులు రాజ్భవన్కు వెళ్ళి ఆమెను పలకరించవలసి వచ్చింది.
మునుగోడు ఉపఎన్నికలలో కమ్యూనిస్టులను వాడుకొని తన అభ్యర్ధిని గెలిపించుకొన్న కేసీఆర్, శాసనసభ ఎన్నికలలో కమ్యూనిస్టులను పులిహోరలో కరివేపాకులా తీసిపడేశారు. దాంతో వారు కేసీఆర్ తమని మోసగించారని ఆగ్రహంతో మండిపోతున్నారు. ఉపఎన్నికలలో బిఆర్ఎస్ అభ్యర్ధిని గెలిపించమని కోరుతూ ప్రచారం చేసిన కమ్యూనిస్టులే, శాసనసభ ఎన్నికలలో ఆయనను ఓడించాలని పిలుపునిస్తున్నారు. ఇది మరో విచిత్రం!



