ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికైన వైసీపి సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ బుధవారం మండలిలో ప్రమాణ స్వీకారం చేశారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ, “నాకు ఈ అవకాశం కల్పించిన జగన్మోహన్ రెడ్డిగారికి కృతజ్ఞతలు. టిడిపి కూటమి ప్రభుత్వం మాపై ఎన్ని కేసులు నమోదు చేస్తున్నా భయపడే ప్రసక్తే లేదు. ప్రజా సమస్యలపై మండలిలో నిలదీస్తూనే ఉంటాము. అలాగే ఎన్నికల హామీలని అమలు చేసేవరకు టిడిపి కూటమి ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తూనే ఉంటాము,” అని అన్నారు.
సమైక్య రాష్ట్రంలో, మళ్ళీ జగన్ ప్రభుత్వంలో మంత్రి పదవులు చేపట్టిన బొత్స సత్యనారాయణ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పదవికి ఏకగ్రీవంగా ఎన్నికవడం గొప్ప విషయం కాదు. నిజానికి ఆయన తన స్థాయిని దిగజార్చుకున్నారని చెప్పవచ్చు. అయితే ప్రజాసామ్య వ్యవస్థలో ఏ పదవీ ఎక్కువా తక్కువా కాదని, దేని గౌరవం దానికి ఉంటుందని సర్ధి చెప్పుకోవచ్చు. మంచిదే.
జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మళ్ళీ శాసనసభలో అడుగుపెట్టలేదు. ‘మనకి శాసనసభలో పెద్దగా పని లేదని ముందే చెప్పేశారు కనుక జగన్ ఇక ముందు కూడా రాకపోవచ్చు.
కనుక తదుపరి శాసనసభ సమావేశాలకు జగన్ రాకపోయినా బొత్స సత్యనారాయణ తప్పకుండా వస్తారో లేదో కూడా చెప్పేస్తే ఓ పని అయిపోతుంది కదా? ఎందుకంటే, సమావేశాలకు జగన్ హాజరు కాకుండా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరవరని ఇప్పటికే స్పష్టం అయ్యింది.
తెలంగాణ శాసనసభ సమావేశాలలో కేటీఆర్, హరీష్ రావులను ప్రతీసారి కేసీఆర్ ఎందుకు రావడం లేదని కాంగ్రెస్ మంత్రులు నిలదీస్తూనే ఉన్నారు. అలాగే టిడిపి సభ్యులు కూడా బొత్స సత్యనారాయణని జగన్ గురించి నిలదీయవచ్చు. కనుక సభకు వస్తారో లేదో?అనే సందేహం కలుగడం సహజం.




