తిరుపతి శ్రీవిద్యానికేతన్ 30వ వార్షికోత్సవ వేడుకలతో పాటు తన పుట్టినరోజు వేడుకలు జరుపుకున్న మోహన్ బాబు, ఈ సందర్భంగా మాట్లాడిన మాటలు చర్చకు దారి తీసాయి. “నేను ఎంతో మంది రాజకీయ నాయకులకు ఉపయోగపడ్డాను గానీ., తనకు ఎవరూ ఉపయోగపడలేదని., పడరని కూడా తనకు తెలుసునని., ఎన్నికల ప్రచారంలో తనను వాడుకున్నారని., తన జీవితమంతా కష్టాలమయమని ఉద్యేగభరితంగా ప్రసంగించారు.
తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్ మాత్రమే తనను రాజ్యసభకు పంపారని., ఆ తరువాత ఇంకెవరు తనకు చేసిందేమి లేదంటూ అని కూడా అన్నారు. అయితే ఇప్పుడు ఈ వ్యాఖ్యలే అటు రాజకీయ రంగంలోను, ఇటు సినీ రంగంలోను తీవ్ర చర్చనీయాంశలయ్యాయి. మంచు ఫ్యామిలీ సమాజానికి ఏం మంచి చేశారో ముందు అది మాట్లాడమని సోషల్ మీడియాలో కౌంటర్ల వర్షం కురుస్తుంది.
2019 ఎన్నికల సమయంలో టీడీపీ పార్టీని తీవ్రంగా విమర్శించి, చంద్రబాబు మీద ఎన్నో ఆరోపణలు చేసి వైసీపీని – జగన్ నాయకత్వానికి మంచు ఫ్యామిలీ (మనోజ్ మినహాయింపు) మద్దతు తెలిపిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు తనకు అన్యాయం చేసిందేవరని మోహన్ బాబు భావిస్తున్నారో కూడా చెప్పకనే చెప్పారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక కూడా, మోహన్ బాబు మాటల్లో నిరాశ, నిస్పృహలు స్పష్టంగా కనపడుతుండడంతో జగన్ వీరిపై సీత కన్నేశారనే ప్రచారం పొలిటికల్ వర్గాలలో జరుగుతోంది.
ఇందులో మరో వాదన కూడా వినపడుతోంది. విద్యాలయాలు., యూనివర్సిటీల రూపంలో జగన్ మంచు ఫ్యామిలీకి సహకరించారని, ఈ విషయంలో మంచు విష్ణు స్వయంగా తాడేపల్లి వచ్చి మరీ కృతజ్ఞతలు తెలిపిన విషయాన్ని గుర్తు చేసారు. అలాగే తెలుగు సినీ ‘మా’ ఎన్నికలలో తెర వెనుక ఉండి మొత్తం ఎన్నికల తంతుని పూర్తి చేసి, మంచు ఫ్యామిలీ గెలుపుకి పూర్తి సహాయ సహకారాలు అందించి, చక్రం తిప్పిందెవరో అందరికి తెలిసిన విషయమేనని గుర్తు చేస్తున్నారు.
మా ఎన్నికలలో విజయాన్ని కట్టపెట్టినా తమకు ఒరిగిందేమి లేదని., మంచు వారి ఆశలన్నీ కరిగిపోయేలా జగన్ చర్యలు ఉన్నాయనేది మోహన్ బాబు మనోగతం కావచ్చునని సినీ రంగంలో కూడా చెవులు కొరుక్కుంటున్నారు. గడిచిన కొంత కాలంగా ఏపీ ప్రభుత్వానికి – తెలుగు సినీ ఇండస్ట్రీకి మధ్య ఎదురైన ఎన్నో సమస్యలపై కనీస స్పందన ఈ సినీ పెద్ద కుటుంబం నుండి కరువైంది.
ఇండస్ట్రీ సమస్య మీద ప్రభుత్వాన్ని నిలదీసిన పవన్ ను తప్పుపట్టారు., సమస్యల గురించి ప్రభుత్వానికి విన్నవించిన చిరంజీవిని హేళన చేశారు మంచు విష్ణు. ఇలా అటు సినీ ఇండస్ట్రీ దృష్టిలో పలుచనయ్యి.,ఇటు రాజకీయ క్రీడలో మోసపోయానని విషయాన్ని ఇప్పటికి మోహన్ బాబు గ్రహించినట్టున్నారు అని నెట్టింట సెటైర్లు పేలుతున్నాయి.
సినీ ఇండస్ట్రీ అగ్ర హీరోలంతా చిరు వెంట నడిచి ఇండస్ట్రీ పెద్ద ఎవరో సినీ రంగానికే కాకుండా పరోక్షంగా తెలుగు ప్రజలకు కూడా తెలియచెప్పారన్న వాదన వినపడుతోంది. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సినీ రంగానికి సంబంధిన ఏ విషయం చర్చించాలి అన్నా, ముందుగా ఆహ్వానం పలికేది మెగాస్టార్ కేనని ఇటీవల రాజమౌళి చేసిన వ్యాఖ్యలతో సుస్పష్టమైంది.
జక్కన్న చేసిన వ్యాఖ్యలు మంచు మోహన్ బాబుకి తన కళ్ళ ముందు ఉన్న పొగమంచు కరిగి తత్వం బోధపడినట్లుందని సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న విషయం. పెద్దరికం అనేది ఒకరి దగ్గర నుండి లాక్కుంటేనో., ఆశిస్తేనో వచ్చేది కాదు, తమ వారి కష్ట-సుఖాలలో వెన్నంటే ఉండి, వారికి నేనున్నాను అనే భరోసా కలిపించిన వాడే పెద్దరికం బాధ్యతలు తీసుకోవాలనేది మోహన్ బాబు తెలుసుకోవాల్సిన యదార్థం.



